అప్రమత్తంగా ఉండాలి
భారీ వర్షాలపై అధికారులకు సిఎం కెసిఆర్
హైదరాబాద్ CLiC2NEWS: భారీ వర్షాల కారణంగా శ్రీరాంసాగర్ ప్రాజకెక్టు ఎగువనుంచి గోదావరి నదీ పరీవాహక ప్రాంతంల్లో వరద పెరుగుతున్నందనున యుద్ధప్రాతిపదికన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ప్రజాప్రతినిధులను, అధికారులను ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి ఇవాళ (గురువారం) సమీక్ష నిర్వహంచారు. బాల్కొండ నియోజకవర్గంతో పాటు నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, తక్షణమే పర్యవేక్షించాలని ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని సీఎం ఆదేశించారు. ఇప్పటికే నిర్మల్ పట్టణం నీటమునిగిందని అక్కడికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తక్షణమే పంపాలని సీఎస్ సోమేశ్ కుమార్ను కేసీఆర్ ఆదేశించారు. ప్రజలకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని గోదావరి పరీవాహక ప్రాంత జిల్లాల కలెక్టర్లను, ఎస్పీలను, రెవెన్యూ అధికారులు, ఆర్ అండ్ బీ శాఖ అధికారులను సీఎం ఆదేశించారు.
గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలందరూ ఇండ్లల్లోంచి బయటకు రావద్దని సీఎం కేసీఆర్ సూచించారు. వాగులు వంకలన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్ననేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు. గోదావరితో పాటు కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లో.. మన రాష్ట్రంతో పాటు ఎగువ రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. ఆయా రాష్ట్రాల వాళ్లు కూడా అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తుతున్నారని, ఈ నేపథ్యంలో తెలంగాణలోకి వరద ఉధృతి పెరగనున్నదని పేర్కొన్నారు. గోదావరి, కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లోని తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ తమ జిల్లాల్లో, తమ తమ నియోజకవర్గాల్లో వుంటూ ఎప్పటికప్పుడు వరద పరిస్థిని సమీక్షిస్తూ వుండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ ప్రాంతాల అన్నిస్థాయిలలోని టీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు తెలంగాణ భవన్ కు అందుబాటులో ఉంటూ పరిస్థితులను సమీక్షిస్తుండాలని తెలిపారు.