Mandapeta: ఘనంగా ఏకలవ్యుని జయంతి వేడుకలు..
మండపేట (CLiC2NEWS): పట్టణంలో ఏకలవ్యుని జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఏపీ ఎరుకల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. 26వ వార్డు రైతు బజార్ సమీపంలోని ముస్లిం షాదీఖానా భవనంలో మంగళవారం ఏకలవ్యుని జయంతి జరిపారు. ఎరుకుల సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షులు అమలదాసు రుద్రమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు సంగడాల సత్యనారాయణ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు దూలి జయరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏకలవ్యుని చిత్రపటం ఏర్పాటు చేసి పూల మాలలు వేసి ఏకలవ్యున్ని స్మరించుకున్నారు. జిల్లా అధ్యక్షుడు సంగడాల సత్యనారాయణ మాట్లాడుతూ మా కుల దైవం, మూల పురుషుడు ఏకలవ్యుడేనని అన్నారు. ఏకలవ్యునికి ఎంతో ఘన చరిత్ర ఉందన్నారు. జయరాజు మాట్లాడుతూ విలువిద్యలో ఏకలవ్యున్ని మించిన ప్రతిభాశాలి లేరని అన్నారు. గురువు విగ్రహాన్ని ఎదురుగా పెట్టుకొని విలువిద్యను నేర్చుకున్న ధీశాలి ఏకలవ్యుడు అన్నారు. అంత గొప్ప విద్య నేర్చుకున్న ఏకలవ్యుడు గురుదక్షిణగా తన బొటన వేలు నరికి ఇచ్చి గురువు ఆజ్ఞను శిరసా వహించిన గొప్ప వ్యక్తి ఏకలవ్యుడు అని అన్నారు. ఎరుకలు ఏకలవ్యుని వారసులుగా పుట్టడం ఎంతో అదృష్టం అన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి సింగం రాంబాబు, 26 వ వార్డు కౌన్సిలర్ అమల దాసు లక్ష్మి, మండల అధ్యక్షుడు సమతం అప్పారావు, కుల పెద్దలు, గంగరాజు, నూకరాజు, పాండవులు చిన్నబ్బులు, పోసయ్య, అన్నవరం, సత్యనారాయణ, దుర్గాప్రసాద్, సహదేవుడు, రామకృష్ణ, శ్రీను, రాధాకృష్ణ, రమణ ఇతర కుల పెద్దలు పాల్గొన్నారు.