కెటిఆర్ లాంటి నేతలు ఉంటే నాలాంటి వాళ్ల అవసరం ఉండదు: సోనూ సూద్
సోనూసూద్... వాటికి భయపడాల్సిన పనిలేదు: మంత్రి కెటిఆర్
హైదరాబాద్ (CLiC2NEWS): కొవిడ్ కష్టకాలంలో ఎటువంటి స్వార్థం లేకుండా సోనూసూద్ మానవత్వంతో సేవాభావం చాటుకున్నారని మంత్రి కెటిఆర్ అన్నారు. హెచ్ఐసీసీలో కొవిడ్-19 వారియర్స్ సన్మాన కార్యక్రమం సోమవారం తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి కెటిఆర్, సినీ నటుడు సోనుసూద్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. సమాజం సవాళ్లను ఎదుర్కొన్నప్పుడు ప్రభుత్వమొక్కటే అన్నీ చేయలేదని మంత్రి అన్నారు. సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేయడం చాలా సులభం అని.. బాధ్యతగా సేవ చేయడం గొప్ప అని అన్నారు. సోనూ సూద్ సేవ చేస్తే ఐటీ, ఈడీ దాడులు చేయించారన్నారు. అలాగే వ్యక్తిత్వాన్ని తగ్గించే ప్రయత్నం చేశారని విమర్శించారు. సోనుసూద్ రియల్ హీరో అనీ.. ఇలాంటి వాటికి సోనుసూద్ భయపడాల్సిన అవసరం లేదన్నారు. తాము అండగా ఉంటామన్నారు. కొవిడ్ కష్టకాలంలో సోనుసూద్ సేవాభావాన్ని చాటుకున్నారని, తన పని.. సేవతో ప్రపంచం దృష్టి ఆకర్షించారన్నారు.

కెటిఆర్ లాంటి నేతలుంటే నా అవసరం ఉండదు: సోనుసూద్
సోనుసూద్ మాట్లాడుతూ.. మంత్రి కెటిఆర్ లాంటి నేతలు ఉంటే తనలాంటి వాళ్ల అవసరం ఉండదన్నారు. మంత్రి కేటీఆర్పై ప్రశంసలు కురిపించారు. కొవిడ్తో ఉద్యోగాలు, చదువులు, ఆత్మీయులను కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారన్నారు. వాళ్లకు సహాయ పడడమే ఇక తన ముందున్న సవాల్ అన్నారు. జమ్మూ నుంచి కన్యాకుమారి వరకు తాను సహాయ కార్యక్రమాలు చేశానని తెలిపారు. తెలంగాణ నుంచే ప్రతిస్పందించే వ్యవస్థ కనిపించిందని సోనూ సూద్ తెలిపారు.