బాలికల హాస్టల్ గదిలోకి పాము.. ఒకరు మృతి
మరో ముగ్గురికి తీవ్ర అస్వస్థత..
Snake bite: ఓ ప్రైవేట్ స్కూల్ బాలికల హాస్టల్ గదిలోకి పాము (Snake) దూరి నిద్రలో ఉన్న విద్యార్థినులను కాటేసింది. ఈ ఘటనలో ఒక విద్యార్థి మృతి చెందింది. మరో ముగ్గురు తీవ్ర అస్వస్థతకు గురై చికిత్సపొందుతున్నారు. ఈ ఘటన ఝార్ఖండ్ రాష్ట్రంలోని లోహర్ దగా జిల్లాలో చోటుచేసుకుంది. సన్వసిరా హయ్యర్ సెకండరీ రెసిడెన్షియల్ స్కూల్ లో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. హాస్టల్ గదిలోకి ప్రవేశించిన పాము.. నిద్రిస్తున్న విద్యార్థినిని కాటేసింది. ఆమె గట్టిగా కేకలు వేయడంతో మిగతా విద్యార్థినులు లేచారు. ఇంతలో పాము మరో ముగ్గురిని కాటేసింది. విద్యార్థినులంతా భయబ్రాంతులకులోనై కేకలు వేయడంతో హాస్టల్ సిబ్బంది వచ్చారు. వెంటనే పాము కాటేసిన నలుగురు విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి వెళ్లే సరికే నలుగురిలో ఒక విద్యార్థి మృతి చెందింది. మరో ముగ్గురు బాలికలు చికిత్స పొందుతున్నట్లు సమాచారం.
విషయం తెలుసుకున్న బాలికల తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకున్నారు. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయిందని ఆవేదన చెందుతున్నారు. బాద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తూ ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టారు.