చాలా దేశాలు వ్యాక్సిన్ లేకుండానే కరోనాను నియంత్రించాయి!: డబ్ల్యూహెచ్వో

జెనీవా: ప్రపంచంలోని చాలా దేశాలు వ్యాక్సిన్ లేకుండానే కొవిడ్-19ను నియంత్రించాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధానోమ్ ఘెబ్రెయెసస్ అన్నారు. అన్ని దేశాల్లో వైరస్ వికృతరూపం చూపిస్తోంది. మాయదారి రోగం నుంచి ఎప్పుడు విముక్తి దొరుకుతుందాని జనం ఆశగా ఎదురుచూస్తుంది. మరోవైపు వ్యాక్సిన్ అభివృద్ధి దేశాలు నిమగ్నమయ్యాయి. తాజాగా కరోనా కట్టడిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధానోమ్ ఘెబ్రెయెసస్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ మహమ్మారితో అన్ని దేశాలు ప్రభావితమయ్యాయని, కానీ అన్ని దేశాలు ఒకే రకంగా ప్రభావితం కాలేదని ఆయన చెప్పారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వనరులతోనే కొవిడ్ను కట్టడి చేయవచ్చని చాలా దేశాలు నిరూపించాయని టెడ్రోస్ అన్నారు. అయితే అన్ని దేశాలూ టెస్టింగ్ విషయంలో మాత్రం ముందున్నాయని ఆయన తెలిపారు. ఈ మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచీ డబ్ల్యూహెచ్వో టెస్టులు ఎక్కువగా చేయాల్సిందిగా సూచిస్తోందని, దీనికోసం అవసరమైన పరికరాలు కూడా అందించామని ఆయన చెప్పారు.
ఇప్పటి వరకు ఉన్న కేసులు, మరణాలలో 50 శాతం కేవలం నాలుగు దేశాలలోనే నమోదయ్యాయని, 70 శాతం కేసులు, మరణాలు టాప్ 10 దేశాల్లోనే ఉన్నాయని వెల్లడించారు. ప్రస్తుతం వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తున్న తరుణంలోనూ టెస్టింగ్ అనేదే కీలకపాత్ర పోషించనుందని టెడ్రోస్ స్పష్టం చేశారు. ప్రస్తుతం వ్యాక్సిన్ ప్రయోగాలు తుది దశకు చేరుకున్నాయని, త్వరలోనే అందుబాటులోకి రానుందని టెడ్రోస్ విశ్వాసం వ్యక్తం చేశారు. అయినప్పటికీ ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ.. కొవిడ్ నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు.