ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
ప్రకాశం: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మార్టూరు వద్ద నేషనల్ హైవేపై లారీని వెనక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన రెండు కుటుంబాలకు చెందిన నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. ఈ ఘటనలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
మృతులు.. రేంబార్ కనక మహాలక్ష్మి (58), ఏలూరుసబ్ కోర్టులో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కనకమహాలక్షి భర్త బలిజ సత్యన్నారాయణ(63), వ్యాపారి. పర్వతనేని విజయలక్ష్మి (58) న్యాయవాది, విజయలక్ష్మి భర్త రవీంద్రనాథ్ చౌదరి-60 (చినబాబు), వ్యాపారి.

ఏలూరు అశోక్ నగర్లో నివాసముంటున్న కనకమహాలక్ష్మి, ఆమె భర్త సత్యనారాయణ.. ఎన్ ఆర్ పేట వాసులు విజయ లక్ష్మి, ఆమె భర్త రవీంద్రనాథ్ చౌదరి (చినబాబు), కనక మహాలక్ష్మి మేనల్లుడు సందీప్సాగర్ మూడు రోజుల కిందట తిరుమల దైవ దర్శనానికి కారులో బయలు దేరారు. విజయలక్ష్మి, రవీంద్రనాథ్ చౌదరికి మూడు నెలల కిందటే వివాహమైంది. ఈ నేపథ్యంలో నూతన దంపతులకు తోడుగా దైవదర్శనానికి ఆమె స్నేహితురాలైన కనకమహాలక్ష్మి, ఆమె భర్త వెళ్లారు. తిరుమలలో దర్శనం అనంతరం అక్కడ నుంచి ఏలూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందడంతో పోలీసుల, హైవే సిబ్బంది ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన తీరును బట్టి చూస్తే నిద్రమత్తు, అతివేగం వల్లే జరిగిందని భావిస్తున్నారు. తిరుమలకు వెళ్లొస్తుండగా ప్రమాదం జరగడం.. నలుగురు ఇలా ప్రాణాలు కోల్పోవడం, వారిలో ఇద్దరు న్యాయవాదులు కావడంతో వారి నివాసాల వద్ద, ఏలూరు కోర్టు ప్రాంగణంలోనూ తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.