మిస్సింగ్ కేసుల ఛేదనలో దూసుకుపోతున్న యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ బృందం

నల్లగొండ : మిస్సింగ్ కేసులను చేధించడం లక్ష్యంగా డిఐజి ఏ.వి. రంగనాధ్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ టీమ్ దూసుకుపోతూ అద్భుత ఫలితాలు సాధించడంతో పాటు మిస్సింగ్ కేసుల పిర్యాదుదారుల కుటుంబాలలో ఆనందం నింపుతుంది.
తాజాగా 2014 సంవత్సరంలో కుటుంబ సభ్యుల.మధ్య మనస్పర్థలతో ఇంటి నుండి వెళ్లిపోయిన మహిళను గుర్తించి గురువారం ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. నల్లగొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డు సిద్ధార్థ కాలనీకి చెందిన చుక్కా జాస్మిన్ ప్రసిల్లా 2014 సంవత్సరంలో తన కుటుంబ సభ్యులకు మధ్య తలెత్తిన మనస్పర్థలతో ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోయింది. ఆమె తండ్రి మార్టిన్ పిర్యాదు మేరకు నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. మిస్సింగ్ కేసులను చేధించడానికి ఏర్పాటు చేసిన యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ టీమ్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో గుంటూరు జిల్లా నరసరావుపేటలో ప్రైవేట్ హాస్పిటల్ లో ఫిజియోథెరపీ టెక్నిషియన్ గా పని చేస్తున్నట్లుగా గుర్తించి అక్కడి నుండి తీసుకువచ్చి ఆమె కుటుంబ సభ్యులకు గురువారం అప్పగించారు. ఏడు సంవత్సరాల తర్వాత తన కూతురును చూసి ఆమె తల్లిదండ్రులు చెమ్మగిల్లిన కళ్లతో సంతోషం వ్యక్తం చేసి యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.
మిస్సింగ్ కేసులను చేధించడంలో కీలకంగా పని చేస్తున్న సిఐ సత్యం, ఎస్.ఐ.లు రాంబాబు, నాగుల్ మీరా, కానిస్టేబుల్స్ నర్సింహా, మధు, నజీర్, బాలయ్య, సాయి సందీప్ లను డిఐజి ఏ.వి.రంగనాధ్ ప్రత్యేకంగా అభినందించి జిల్లాలో ఉన్న అన్ని మిస్సింగ్ కేసులను త్వరితంగా పరిష్కరించి వారి కుటుంబాలకు అప్పగించేలా కృషి చేయాలన్నారు.