Singer Janaki: ప్రముఖ గాయని, గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
Singer Janaki: ప్రముఖ గాయని, గానకోకిలగా పేరుగాంచిన ఎస్.జానకి శనివారం ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. వయోధిక సమస్యలతో మైసూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందతూ ఆమె ఈరోజు కన్నుమూశారు. ఈ మేరకు ఆమె మనవరాలు ఆప్సర ఇన్స్టా వేదికగా ప్రకటించారు. ఎపిలోని గుంటూరు జిల్లా రేపల్లె మండలం, పల్లపట్ల గ్రామంలో 1938 ఏప్రిల్ 23న జన్మించారు. తెలుగు, తమిళ, మలయాళం , కన్నడ, హిందీ అన్ని భాషల్లో కలిపి దాదాపు 50 వేలకు పైగా పాటలు ఆలపించారు. తెలుగు చిత్రాలలో ఆమె పాడిన పాటలు ఇప్పటికీ ప్రజాదరణ పొందుతూనే ఉన్నాయి. ఆమె మృతిపై సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు.ఈ ఏడాదిలో ఆమె కుమారుడు మురళీకృష్ణ మృతితో ఆమె తీవ్ర మనోవేదనకు గురైయ్యారు. కుమారుడు మరణించిన కొన్ని నెలలకే ఆమె కన్నుమూయడం సినీ ప్రపంచానికి తీరని లోటు.
జానకమ్మ గారు.. మీ స్వరం ఎప్పటికీ అమరం.. చిరంజీవి
సంగీత ప్రపంచంలోని ఓ మహోన్నత శిఖరాన్ని కోల్పోయామని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ప్రముఖ గాయని ఎస్ జానకి మృతిపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన సినీ ప్రయాణంలో ఎన్నో మరపురాని పాటలకు ఆమె అపురూప గాత్రాన్ని అందించారని గుర్తు చేసుకున్నారు. జానకమ్మ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
యావత్ భారతీయ చలన చిత్ర పరిశ్రమకు తీరని లోటు.. బాలకృష్ణ
గాన కోకిల, లెజెండరీ సింగర్ జానకమ్మ.. తన మధురమైన గళంతో దశాబ్దాల పాటు కోట్లాది మంది సంగీతాభిమానులను అలరించారన్నారు. ఆమె మరణ వార్త దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. అద్భుత గాత్రంతో భారతీయ సంగీత ప్రపంచంలో చెరగని ముద్ర వేశారన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు.
నాలుగు జాతీయ అవార్డులు
బాల్యంలోనే నాదస్వరం విద్యాంసుడైన పైడిస్వామి వద్ద జానకమ్మ సంగీతం నేర్చుకున్నారు. ఆమెకు సంగీతంపై ఉన్న ఆసక్తిని గ్రహించిన ఆమె మేనమామ చెన్నై తీసుకెళ్లారు. 1957లో తమిళ చిత్రమైన ‘విధియిన్ విలైయాట్టు’తో ఆమె కెరీర్ ప్రారంభమైంది. అయితే , అదే ఏడాది తెలుగు చిత్ర సీమలో కూడా ఆమె ప్రస్థానం మొదలైంది. ‘ఎమ్మెల్యే’ అనే తెలుగు సినిమా తో తెలుగు సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. అప్పటి నుండి ఆరు దశాబ్దాలు మైమరపించే మెలోడీ పాటలు, మాస్ సాంగ్లే కాకుండా.. భక్తి గీతాలు .. ఇలా ఎన్నో పాటలు పాడి ప్రేక్షకులను మైమరపించారు. జానకమ్మ 1959లో వి. రామ్ ప్రసాద్ను వివాహం చేసుకున్నారు. గాన కోకిల.. జానకమ్మకు నాలుగు జాతీయ అవార్డులు, పలు సినీ అవార్డులు వరించాయి. 1977లో ’16 ఏళ్ల వయస్సు’ తమిళ చిత్రంలో పాడిన పాట ‘సెంధూర పూవే’.. తమిళ పాటకు మొదటి జాతీయ అవార్డును అందుకున్నారు. 1981లో ‘ఒప్పోల్ ‘మలయాళ సినిమాలోని క్లాసికల్ మెలోడి సాంగ్కు రెండో సారి జాతీయ అవార్డు వరించింది. ఇక, మూడో సారి ఆమెకు జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన పాట ‘సితార’ చిత్రంలోని ‘వెన్నెల్లో గోదారి అందం’.. అనే తెలుగు పాటకు జానకమ్మకు మూడవ జాతీవ అవార్డు వరించింది. 1992లో తమిళ చిత్రం ‘దేవర్మగన్’ (తెలుగులో క్షత్రియ పుత్రుడు) సినిమాలో ‘ఇంజి ఇడుప్పళగా’.. అనే తమిళ పాటకు నాలుగోసారి జాతీయ పురస్కారం వరించింది. 2013లో ఆమెను పద్మభూషణ్ పురస్కారంతో కేంద్రప్రభుత్వం సత్కరించింది.
అమెకు జాతీయ పురస్కారాలతో పాటు 33 రాష్ట్ర ప్రభుత్వ చలన చిత్ర అవార్డులు , 10 నంది అవార్డులు వరించాయి. అదేవిధంగా కేరళ ప్రభుత్వం, తమిళనాడు, ఒడిశా నుండి కూడా పలు అవార్డులు , పురస్కారాలు అందుకున్నారు.
Also Read: విహారయాత్రలో విషాదం.. 15 మంది భారత టూరిస్టులు మృతి