వనస్థలిపురంలో కారు బీభత్సం..
హైదరాబాద్: వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలోని హస్తినాపురంలో శనివారం తెల్లవారు జామున కారు బీభత్సం సృష్టించింది. నగర శివార్లలోని హస్తినాపురంలో వేగంగా దూసుకొచ్చిన కారు ట్రాఫిక్ సిగ్నల్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సందీప్ అనే యువకుడు అక్కడికక్కడే మరణించాడు. టీఎస్ 05 ఎఫ్హెచ్ 2356 నంబర్ కలిగిన మారుతీ ఎస్క్రాస్ కారు సాగర్ రింగ్ రోడ్డు నుంచి ఇబ్రహీంపట్నం వైపు వెళ్తున్నది. మితిమీరిని వేగంతో వెళ్తున్న కారు హస్తినాపురం వద్ద అదుపుతప్పి ట్రాఫిక్ సిగ్నల్ స్తంభాన్ని ఢీకొట్టింది. డివైడర్ను దాటుకుని రోడ్డుకు అవతలివైపు ఉన్న బారిడ్లపైకి ఎక్కి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో వెనక సీట్లో కూర్చున్న సందీప్ అనే యువకుడు అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం సమయంలో కారులో ముగ్గురు ఉన్నట్లు తెలిపారు. కారు నడుపుతున్న గౌతమ్ మద్యం మత్తులో ఉన్నాడని, అతన్ని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. మరో యువకుడు పరారయ్యాడని వెల్లడించారు.