తమిళనాడులో ఓటు వేసిన తెలంగాణ గవర్నర్ తమిళిసై
చెన్నై: తెలంగాణ గవర్నర్ తమిళిసై తమిళనాడులోని చెన్నైలో గల విరుగంబాక్కం పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా తమిళిసై మాట్లాడుతూ.. ఓటు వేయడమనేది మన నిబద్దతకు నిదర్శనమన్నారు. ఇది మన ప్రజాస్వామ్యంలో అత్యంత శక్తివంతమైన సాధనం. అర్హత కలిగిన ఓటర్లందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద కొవిడ్ నిబంధనలు పాటించాలని గవర్నర్ విజ్ఞప్తి చేశారు.
తమిళనాడులో 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇవాళ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లో కొన్ని కొత్త పార్టీలు కూడా బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. తమిళనాడులో రాజకీయ దిగ్గజాలుగా పేరొందిన కరుణానిధి, జయలలితల మరణం తరువాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొన్నది. ఈ ఎన్నికల్లో 3,998 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తమిళనాడు వ్యాప్తంగా 88,937 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 1.58 లక్షల మంది పోలీసులు బందోబస్తులో ఉన్నారు.