Pat Cummins: 50 వేల డాలర్ల సాయం.. గొప్పమనసు చాటుకున్న పాట్

హైదరాబాద్ (CLiC2NEWS): కరోనా ఉగ్రరూపంతో అల్లాడిపోతున్న భారత్ను ఆదుకునేందుకు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్ ముందుకొచ్చారు. తమవంతు సాయంగా 50 వేల డాలర్లను పీఎం కేర్స్ ఫండ్కు సాయాన్ని ప్రకటించారు. అంతేకాకుండా మిగతా ఐపీఎల్ సభ్యులు కూడా స్పందించాలని కోరారు. కరోనా విజృంభణతో ఆక్సిజన్ నిల్వల తీవ్ర కొరత నేపథ్యంలో పాట్ ఇలా చేయాలనుకున్నారట.
కమిన్స్ బ్యాటుతోనే కాదు.. తన దాతృత్వంతోనూ భారతీయుల ప్రేమకు పాత్రుడయ్యాడు. ఆక్సిజన్ కొరతతో సతమతమవుతున్న భారత్కు సాయం ప్రకటించాడు. పీఎం కేర్స్కు 50వేల డాలర్లు విరాళంగా ఇచ్చాడు. ఆక్సిజన్ కొనుగోలుకు వినియోగించాలని విజ్ఞప్తి చేశాడు. ఈ సందర్భంగా కమిన్స్ సందేశం ప్రతిఒక్కరినీ ఆకట్టుకునేలా ఉంది.
`భారత్.. ఏళ్లుగా నేను ప్రేమిస్తూ వస్తున్న దేశం. నేను ఇప్పటి వరకూ చూసిన వాళ్లలో అత్యంత దయ, మంచి మనసు కలిగినవారు ఇక్కడి ప్రజలు. అలాంటి వారు ఇప్పుడు బాధలో ఉన్నారని తెలియడం నన్ను తీవ్రంగా కలచివేస్తోంది` అంటూ భారత్పై ఉన్న తన ప్రేమను చాటుకున్నాడు కమిన్స్.
`కరోనా విజృంభిస్తున్న సమయంలో ఐపీఎల్ ఆడడం సముచితమా అన్న విషయంపై ఇక్కడ కొంత చర్చ జరుగుతోంది.
లాక్డౌన్లో కాలక్షేపం చేస్తున్న ప్రజలకు ఐపీఎల్ మ్యాచ్లు కాస్త ఉపశమనం ఇస్తాయని అన్నారు. రికార్డు కేసులతో బెంబేలెత్తుతున్న వారికి క్రికెట్ ఊరటనిస్తుందనే విషయాన్ని భారత ప్రభుత్వానికి తాను సూచించదలచుకుంటున్నట్లు తెలిపాడు. ఈ మేరకు కమిన్స్ ప్రకటన విడుదల చేశాడు.
`ఓ మంచి పనితో లక్షల మందిని చేరుకునేందుకు ఆటగాళ్లుగా మాకున్న వేదిక ఓ గొప్ప అవకాశం. అది దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా ఆస్పత్రులకు కావాల్సిన ఆక్సిజన్ సామగ్రిని కొనుగోలు చేయడానికి పీఎం కేర్స్కు నా వంతు సాయంగా 50 వేల డాలర్లు అందిస్తున్నాను. ఐపీఎల్లో నాతోటి సహచరులతో పాటు ప్రపంచవ్యాప్తంగా భారతీయుల దాతృత్వంతో ముగ్ధులైనవారెవరైనా సాయం చేయడానికి ముందుకు రావాలని కోరుతున్నాను“ అని కమిన్స్ పిలుపునిచ్చాడు.
భారతీయుల కష్టాన్ని చూసి ఉబికి వస్తున్న ఉద్వేగానికి సాయం చేయడం ద్వారా కార్యరూపం ఇచ్చే అవకాశం ఉందని కమిన్స్ పిలుపునిచ్చాడు. తద్వారా అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపే అవకాశం ఉందన్నాడు. తాను చేసిన సాయం పెద్దదేమీ కానప్పటికీ.. ఎవరో ఒకరి జీవితంలో మార్పు తీసుకొస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
2021 ఐపీఎల్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్లో పాట్ కమిన్స్ సంచలన ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. సిక్సర్లతో ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. కేవలం 34 బంతుల్లోనే కమిన్స్ 66 పరుగులు చేసి కొత్త చరితను రాశాడు. ఐపీఎల్లో ఒకే ఓవర్లో 30, అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన వారిలో కమిన్స్ ఆరోవ్యక్తిగా నిలిచిన సంగతి తెలిసిందే.
— Pat Cummins (@patcummins30) April 26, 2021