Covid హాస్పిటల్లో అగ్ని ప్రమాదం.. 18 మంది మృతి

అహ్మదాబాద్ (CLiC2NWS): గుజరాత్లో రాష్ట్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కరోనా బాధితులు చికిత్స పొందుతున్న భారుచ్లోని పటేల్ వెల్ఫేర్ హాస్పిటల్లో శుక్రవారం అర్ధరాత్రి తర్వాత అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 18 మంది కరోనా బాధితులు మృతి చెందారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మరో 50 మంది రోగులను స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది రక్షించారని అధికారులు తెలిపారు. కొవిడ్ వార్డులో చికిత్స తీసుకుంటున్న 12 మంది రోగులు మంటలు అంటుకొని, భారీగా వ్యాపించిన పొగ కారణంగా ప్రాణాలు కోల్పోయారని భారుచ్ ఎస్పీ రాజేంద్ర సింహ్ తెలిపారు. చికిత్స పొందుతూ మరో ఆరుగురు మరణించారు. భారుచ్-జంబుసర్ రహదారిపై ఉన్న నాలుగు అంతస్థుల భవనంలో హాస్పిటల్ ఉండగా.. దీన్ని ఓ ట్రస్ట్ నిర్వహిస్తోంది.