వ్యవసాయ బిల్లులపై నిరసనకు వామపక్షాల మద్దతు
అమరావతి: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతాంగ వ్యతిరేక వ్యవసాయ బిల్లులపై ఈ 25న రైతు సంఘాలు నిర్వహించే నిరసన కార్యక్రమాలకు వామపక్షాలు మద్దతు ప్రకటించాయి. దేశవ్యాపితంగా ఈ నెల 25న 200లకు పైగా రైతు సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన కార్యక్రమాలకు పూర్తి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు పి. మధు (సిపిఎం), కె రామకృష్ణ (సిపిఐ), వై.సాంబశివరావు (సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ), జాస్తి.కిషోర్బాబు (సిపిఐ ఎంఎల్), ఎంసిపిఐ యు,సిపిఐ ఎంఎల్ లిబరేషన్,సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, ఎస్యుసిఐ సి, ఫార్వర్డ్బ్లాక్, రివల్యూషనరీ సోషలిస్టుపార్టీ.. అందరు కలిసి మంగళవారం ప్రకటన విడుదల చేశారు. రైతాంగానికి, వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం కలిగించే వ్యవసాయ బిల్లులను పార్లమెంటులో బిజెపి అప్రజాస్వామికంగా ఆమోదింపజేసుకోవడాన్ని, నిరసన తెలుపుతున్న 8 మంది రాజ్యసభ సభ్యులను సస్పెండ్ చేయడాన్ని వీరు తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రాష్ట్రసమితితో సహా వివిధ పార్టీలు లోక్సభ, రాజ్యసభలోని ఈ బిల్లులను వ్యతిరేకించినా మన రాష్ట్రానికి చెందిన అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి ఈ బిల్లులను సమర్థించడాన్ని వారు ఖండించారు.