దీక్షిత్ గొంతు నులిమి చంపేశారు: ఎస్పీ

మహబూబాబాద్:మహబూబాబాద్ జిల్లాలో కలకలం రేపిన కుసుమ దీక్షిత్రెడ్డి(9) కిడ్నాప్, హత్యకేసును పోలీసులు ఛేదించారు. కేసముద్రం మండలం అన్నారం శివారులోని గుట్టపై బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. ఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ కోటిరెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. ‘‘ఆదివారం సాయంత్రం 6గంటలకు ద్విచక్రవాహనంపై వచ్చిన మంద సాగర్ అనే వ్యక్తి దీక్షిత్రెడ్డిని కిడ్నాప్ చేశాడు. కిడ్నాప్ చేసేందుకు ముందుగానే రెక్కీ నిర్వహించి సీసీ కెమెరాల్లో ఎక్కడా దొరక్కుండా జాగ్రత్త పడ్డాడు. అయినా… మహబూబాబాద్ కలెక్టరేట్ వద్ద ఉన్న సీసీ కెమెరాలో మందసాగర్ ద్విచక్రవాహనంపై దీక్షిత్ను తీసుకెళ్తున్న దృశ్యాలు నమోదయ్యాయి. మెకానిక్గా పనిచేసే మందసాగర్ దీక్షిత్రెడ్డి ఇంటికి సమీపంలోనే ఉంటాడు. కిడ్నాప్ చేసిన తర్వాత డబ్బు డిమాండ్ చేశాడు. డబ్బుల కోసమే కిడ్నాప్ చేసినా.. ఆ తర్వాత దొరికి పోతామనే భయంతో బాలుడి గొంతు నులిమి చంపేశాడు. కిడ్నాప్ చేసిన గంటన్నరకే గొంతు నులిమి హతమార్చాడు. ఆ తర్వాత అన్నారం శివారులోని గుట్టపైకి మృత దేహాన్ని తీసుకెళ్లారు. చంపిన విషయం దాచిపెట్టి బాలుడిని విడిచిపెట్టేందుకు రూ.45లక్షలు డిమాండ్ చేశాడు. చంపిన తర్వాత కూడా రెండ్రోజుల పాటు ఫోన్లు చేస్తూనే ఉన్నాడు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో నిందితులను పట్టుకున్నాం. మందసాగర్తో పాటు మనోజ్రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నాం. అతని పాత్రపై కూడా విచారణ జరుపుతున్నాం. నిందితులు ఇంటర్నెట్ కాల్స్ చేసినా హైదరాబాద్ సైబర్ క్రైమ్ టాస్క్ఫోర్స్ సాయంతో ఛేదించాం. మంద సాగర్ ఒక్కడే దీక్షిత్ను హత్య చేశాడు. నిందితుడిని పూర్తిగా విచారిస్తే మరిన్ని నిజాలు బయటపడొచ్చు’అని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు.