సూర్యాపేటలో బాలుడి అదృశ్యం
సూర్యాపేట: దీపావళి పండుగ, అందరూ సందడిగా టపాకాయలు కాల్చకుంటుంటే టపాకాయలు కొనుక్కుందామని బయటికి వెళ్లిన ఐదేళ్ల బాలుడు గౌతమ్ ఎంతకీ ఇంటికి తిరిగి రాలేదు. తమ బాబు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక భగత్ సింగ్ నగర్కు చెందిన నగేష్, నాగలక్ష్మీ దంపతుల ఒక్కగానొక్క కొడుకు గౌతమ్(5). నిన్న రాత్రి గం.7.30 నిముషములకు దివాళీ క్రాకర్స్ కొనేందుకు పక్కనే ఉన్న ఓ కిరాణా షాపులోకి వెళ్లిన గౌతమ్.. ఆ తర్వాత ఇంటికి రాలేదు.
తన కుమారుడి కోసం తల్లిదండ్రులు గాలించగా.. కిరాణా షాపుకి కొద్ది దూరంలోనే బాలుడి సైకిల్ పడి ఉండటం గమనించారు. దీనితో బాలుడి తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాలుడిని ఎవరైనా కిడ్నాప్ చేసారా.? అన్న కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా సమాచారం ప్రకారం కిడ్నాపర్ దగ్గర నుంచి గౌతమ్ నివాసం పక్కన టైలర్ షాపుకు ఫోన్ వచ్చింది. పిల్లడు తమ దగ్గర ఉన్నాడని దుండగుడు చెప్పడంతో.. సిమ్ కార్డు ఎవరిది.? ఫోన్ కాల్ ఎక్కడ నుంచి వచ్చిందో.? పోలీసులు తెలుసుకుంటున్నారు.