మాస్క్ ధరించకపోతే జైలుకే!
కరోనా కట్టడి కోసం హిమాచల్ సర్కార్ కఠిన నిర్ణయం

సిమ్లా: కరోనా వ్యాప్తిని అడ్డుకొనేందుకు ప్రభుత్వాలు ఎన్ని కఠిన నియమాలు తెచ్చినా.. చలామంది ప్రజలు వాటిని లెక్కచేయడంలేదు. కరోనా మహమ్మారి ఢిల్లీ, రాజస్థాన్ వంటి పలు రాష్ట్రాల్లో రోజురోజుకీ విజృంభిస్తోంది. ఆయా రాష్ట్రాల్లో కొత్తగా పలు రకాల కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం నియమాలు ఉల్లంఘించేవారి పట్ల మరింత కఠినంగా వ్యవహరించాలని భావిస్తోంది. ఈ క్రమంలో బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించని వారని తక్షణమే అరెస్ట్ చేసి జైల్లో వేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా సిర్మౌర్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ మాట్లాడుతూ.. ‘బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా మాస్క్ లేకుండా కనబడితే.. వారెంట్తో సంబంధం లేకుండా వారిని అరెస్ట్ చేస్తాం. ఇక నేరం రుజువైతే వారికి ఎనిమిది రోజుల జైలు శిక్షతోపాటు ఐదు వేల రూపాయల జరిమానా కూడా విధిస్తాం’ అని తెలిపారు. ఇక కరోనా కట్టడి కోసం ప్రజలంతా తప్పక మాస్క్ ధరించాల్సిందిగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. ముఖ్యంగా బహిరంగా ప్రదేశాల్లో మాస్క్ ధరించడం తప్పని సరి చేశాయి. తాజాగా ఢిల్లీలో కేసుల సంఖ్య భారీగా పెరిగింది. దాంతో మాస్క్ ధరించని వారికి 500-5,000 రూపాయల వరకు చలాన్లు విధిస్తుంది.