నివర్ తుపాన్: తిరుమలలో భారీ వర్షం
తిరుపతి: నివర్ తుపాను చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలో తీవ్ర ప్రభావం చూపుతోంది. తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు తిరుమలలో జలాశయాలు నీటితో నిండాయి. పాప వినాశనం, ఆకాశ గంగ, గొగర్బం, కేపీ డ్యామ్ గేట్లు అధికారులు ఎత్తివేశారు. తుపాను ప్రభావంతో తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడుతున్నాయి. రెండో ఘాట్ రోడ్ హరిణి ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో వెంటనే స్పందించిన టీటీడీ సిబ్బంది జేసీబీ సాయంతో కొండచరియలను తొలగిస్తున్నారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్సానికి శ్రీవారి ఆలయంలోకి వర్షపు నీరు చేరాయి. దీంతో సిబ్బంది మోటార్ల సహాయంతో నీటిని బయటకు పంపుతున్నారు. బాలాజీనగర్ కమ్యూనిటీ హాల్ వద్ద ప్రహారీ గోడ కూలగా, బైక్లు ధ్వంసం అయ్యాయి.


