పివికి భారతరత్న ఇవ్వాలి

హైదరాబాద్‌ : మాజీ ప్రధాని పివి. నరసింహారావుకు దేశ అత్యున్నత పురస్కారం ‘భారత రత్న ‘ ప్రకటించాలని కోరుతూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేశారు. స్థితప్రజ్ఞుడు అనే పదానికి పర్యాయపదం అనేంతగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారని ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు అన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారతదేశం పురోగమించడానికి మూలకారకుడు పివినేనని, ఆయన సంస్కరణలతోనే భారత్‌ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటిగా నిలిచిందని చెప్పారు. ఆయన తెలంగాణ బిడ్డ అని, దక్షిణాది నుండి తొలిసారి ప్రధానమంత్రి పదవి చేపట్టిన రాజనీతిజ్ఞుడని అన్నారు. దేశ ప్రగతికి ఉజ్వలమైన బాటలు వేసిన మహన్నోత దార్శనికుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి పీవీ నరసింహారావుకు ‘భారతరత్న’ ఇవ్వాలని, ఆయన శతజయంతి ఉత్సవాల సందర్భంగా కేంద్రం ప్రకటన చేయాలని విజ్ఞప్తి చేస్తూ.. తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించిందని కెసిఆర్‌ వివరించారు.

భార‌త పూర్వ ప్ర‌ధాని పీవీ శ‌త జ‌యంతి చ‌రిత్ర‌లో విశిష్ట సంద‌ర్భంగా ఉండాలి. ఆత్మ‌గౌర‌వ ప‌తాక అయిన పీవీ శ‌త జ‌యంతి ఉత్స‌వాల‌ను సంవ‌త్స‌రం పాటు నిర్వ‌హించేందుకు ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. దేశానికి చేసిన సేవ‌ల‌ను ప్ర‌జ‌లంద‌రూ స్మ‌రించుకోవాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం ఆశిస్తున్న‌ది. భార‌త్ వేగంగా అభివృద్ధి చెంద‌డానికి, ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో పురోగ‌మించ‌డానికి పీవీ కార‌ణం. పీవీ మ‌న ఠీవీ అని తెలంగాణ స‌గ‌ర్వంగా చెప్పుకుంటున్న సంద‌ర్భం ఇది. పీవీ ప్ర‌ధానిగా బాద్య‌త‌లు స్వీక‌రించిన స‌మ‌యంలో దేశం స‌మ‌స్య‌ల సుడిగుండంలో స‌త‌మ‌త‌వుతోంది. దేశ ఆర్థిక ర‌థాన్ని పీవీ ప్ర‌గ‌తి ర‌థంలో ప‌రుగులు పెట్టించారు.

ప్ర‌ధాని ప‌ద‌వికి చేప‌ట్టిన మొట్టమొద‌టి ద‌క్షిణాది వ్య‌క్తి. నూత‌న ఆర్థిక సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీకారం చుట్టారు. వాటిని స‌మ‌ర్థ‌వంతంగా అమ‌లు చేశారు. రాజ‌కీయాల‌తో సంబంధంలోని ఆర్థిక‌వేత్త మ‌న్మోహ‌న్‌ను ఆర్థిక శాఖ మంత్రిగా నియ‌మించి పీవీ త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నారు. స‌రళీకృత విధానాల‌తో దేశ ఆర్థిక గ‌మ‌నాన్ని మార్చివేశారు. అభివృద్ధి రేటు సున్నా అవుతున్న విప‌త్క‌ర ప‌రిస్థితి నుంచి దేశ ఆర్థిక ప‌రిస్థితిని ప‌ట్టాలెక్కించి ప‌రుగులు తీయించారు. ప్ర‌పంచం న‌లుమూల‌ల నుంచి దేశానికి పెట్టుబ‌డులు వ‌స్తున్నాయంటే దానికి కార‌ణంగా పీవీనే. స‌గ‌టు భార‌తీయుని జీవన శైలి మార‌డంలో కూడా పీవీ దార్శ‌నిక‌త ఉంది. గ్లోబ‌ల్ ఇండియా రూప‌శిల్పి పీవీ. పీవీ ప్ర‌వేశ‌పెట్టిన ఆర్థిక సంస్క‌ర‌ణ‌ల ఫ‌లితాల‌ను నేడు మ‌నం అనుభ‌విస్తున్నాం. ఆధునిక భార‌త‌దేశాన్ని నిర్మించిన రెండో వ్య‌క్తి పీవీ.
తెలుగు అకాడ‌మీని నెల‌కొల్పిన ఘ‌న‌త కూడా పీవీకే ద‌క్కుతుంద‌న్నారు. పీవీ వ్య‌క్తిత్వం స‌మున్న‌త వ్య‌క్తిత్వం. మ‌హోన్న‌త తాత్విక‌వేత్త‌. అఖండ‌మైన పాండిత్యం ఉన్న వ్య‌క్తి. రాజ‌కీయాల్లో మునిగితేలుతూనే వేయి ప‌డ‌గ‌లు అనే న‌వ‌ల‌ను హిందీ భాష‌లోకి అనువాదం చేశారు. ఈ న‌వ‌ల ఇతిహాసం వ‌లే ఉంటుంది. ఈ న‌వ‌ల‌తో పీవీ పాండిత్యం ఏమిటో అర్థ‌మ‌వుతుంది. పీవీ దేశానికి, రాష్ర్టానికి ఎన్నో సేవ‌లందించాల‌రు. అలాంటి మ‌హోన్న‌త వ్య‌క్తికి భార‌త‌ర‌త్న ఇవ్వాల‌ని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామ‌ని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.