రికార్డు స్థాయిలో 1.15 లక్షల కోట్ల జిఎస్టి వసూళ్లు
న్యూఢిల్లీ : డిసెంబర్లో నెలలో వస్తు సేవల పన్ను (జిఎస్టి) వసూళ్లు రికార్డు స్థాయికి చేరాయి. మొత్తం జిఎస్టి వసూళ్ల ఆదాయం రూ.1,15,174 కోట్లుగా ఉంది. జిఎస్టి ప్రవేశపెట్టిన తర్వాత అత్యధిక వసూళ్లు డిసెంబర్లో నమోదు అయ్యాయి. అదేవిధంగా వసూళ్ల ఆదాయం..1.15 లక్షల కోట్ల రూపాయలు చేరడం కూడా ఇదే తొలిసారి. గత ఏడాది ఇదే సమయానికి వసూళ్లయిన ఆదాయానికి కన్నా (రూ.1,13,866 కోట్లు) 12 శాతం ఎక్కువ. సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ (సిజిఎస్టి) రూ 21,365 కోట్లు, రాష్ట్ర వస్తు సేవల పన్ను ( ఎస్జిఎస్టి) రూ.27,804 కోట్లు, ఇంటి గ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ (ఐజిఎస్టి) రూ. 57,426 (దిగుమతులపై వసూలు చేసిన రూ.27,050 కోట్లు కలిపి) సెస్ రూ.8,579 కోట్లు (దిగుమతులపై వసూలు చేసిన రూ. 971 కోట్లు కలిపి)ల రూపంలో ఆదాయం కేంద్రానికి వచ్చి చేరింది. 2020 డిసెంబర్ 31 వరకు ..నవంబర్లో దాఖలు చేసిన జిఎస్టిబిఆర్- 3బి రిటర్న్స్ మొత్తం రూ.87 లక్షలుగా ఉన్నాయి. రెగ్యులర్ సెటిల్మెంట్లో భాగంగా కేంద్రం ఐజిఎస్టి నుండి సిజిఎస్టికి రూ. 23,276 కోట్లు, ఎస్జిఎస్టికి రూ. 17,681 కోట్లు కేటాయించింది. డిసెంబర్ నెలలో రెగ్యులర్ సెటిల్మెంట్ తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పొందిన ఆదాయం..రూ. 44,641 కోట్లు, రూ.45,485 కోట్లుగా ఉంది.