పార్లమెంటు భేటీకి ప్రత్యేక ఏర్పాట్లు

న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 14 నుంచి ప్రారంభం కానున్నాయి. కోవిడ్-19 నిబంధనలను పాటిస్తూ అక్టోబర్ 1 వరకూ సమావేశాలు జరుగుతాయని సంబంధిత అధికారులు మంగళవారం వెల్లడించారు. మరోవైపు, కరోనాతో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాల నిర్వహణ కోసం అధికారులు ఉభయ సభల్లోనూ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భౌతికదూరం నిబంధనల కనుగుణంగా సభ్యులకు సీట్లు కేటాయించనున్నారు. ఈ సారి ఉభయ సభల్లోనూ ఛాంబర్లు, గ్యాలరీల్లోనూ సభ్యులకే సీట్లు కేటాయించనున్నారు. రాజ్యసభలో 60 మంది సభ్యులు ఛాంబర్లోనూ, మరో 51 మంది గ్యాలరీల్లోనూ, మిగతా 132 మంది సభ్యులు లోక్సభలోనూ కూర్చొనేలా ఏర్పాట్లు చేయడం భారత పార్లమెంటు చరిత్రలో 1952 తరువాత ఇదే తొలిసారి. అలాగే, ఇదే తరహా సీటింగ్ ఏర్పాట్లను లోక్సభలోనూ చేస్తున్నారు. ఆయా ప్రదేశాల్లో భారీ తెరాలను ఏర్పాటు చేస్తున్నారు.
ప్రపపంచదేశాలతో పాటు కరోనా భారత్ను కూడా కలవర పెడుతోంది. దేశంలో వైరస్తో మరణిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరిగి పోతోంది. ఈ నేపధ్యంలో భౌతిక దూరం పాటిస్తూ సీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే రేడియేషన్ పద్ధతి ద్వారా ఆల్ట్రా వైలెట్ కిరణాలను ప్రసరింపచేసి వైరస్ను హతమార్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది.