ఈ ఏడాది చివరికి `పాలమూరు-రంగారెడ్డి` పూర్తి: సీఎం కేసీఆర్

హైదరాబాద్: పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టును ఈ ఏడాది చివరి నాటికి వందశాతం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. పాలమూరు – రంగారెడ్డి, డిండి సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ శనివారం ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, సురేందర్, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, సీఎం కార్యదర్శి స్మితా సభర్వాల్, నీటి పారుదల శాఖ సలహాదారు పెంటారెడ్డి, ఈఎన్సీ మురళీధర్ రావు, సీఈలు మోహన్ కుమార్, రమేశ్, రఘునాథరావు, ఎస్ఇలు ఆనంద్, విజయభాస్కర్ రెడ్డి, ఉమాపతి రావు, సూర్య నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సమీక్ష సందర్భంగా `పాలమూరు- రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల పురోగతిపై సిఎం కెసిఆర్ మాట్లాడుతూ.. నల్గొండ జిల్లాలోని మునుగోడు, దేవరకొండ ప్రాంతాలకు సాగునీరు అందించే డిండి ప్రాజెక్టు పనులను ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని చెప్పారు. అలాగే రంగారెడ్డి ప్రాజెక్టును ఈ ఏడాది చివరి నాటికి వందశాతం పూర్తి చేయాలన్నారు. ఈ ప్రాజెక్టులకు ఈ ఏడాది బడ్జెట్లోనూ నిధులు కేటాయిస్తామని సీఎం స్పష్టం చేశారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తయితే మొత్తం మహబూబ్ నగర్ జిల్లా సస్యశ్యామలం అవతుందని అన్నారు. డిండి ప్రాజెక్టు పరిధిలోని కాల్వలు, రిజర్వాయర్ల పనులపై సీఎం సమీక్షించారు. పాలమూరు – రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన పనులకు వెంట వెంటనే బిల్లులు చెల్లించడానికి తక్షణం రూ. 2వేల కోట్లు విడుదల చేయాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు.