ఇలాగైతే కాంగ్రెస్‌ మరో 50 ఏళ్లు ప్రతిపక్షంలోనే : ఆజాద్‌

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ మరోసారి తిరుగుబాటు స్వరం వినిపించారు. ఎన్నికల ద్వారానే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని నియమించాలని ఆ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ డిమాండ్ చేశారు. నేరుగా నియమించిన అధ్యక్షుడికి పార్టీలో ఒకశాతం మద్దతు కూడా ఉండకపోవచ్చునని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో సంస్కరణలు, సంస్థాగత ఎన్నికలు జరగాల్సిందేనని డిమాండ్‌ చేశారు. లేదంటే మరో 50 ఏళ్లు ప్రతిపక్షంలోనే కూర్చోవాల్సి ఉంటుందన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సహా రాష్ట్ర, జిల్లా, బూత్‌స్థాయి అధ్యక్షుల వరకు అన్ని కీలక పదవులకూ ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఎన్నికల ద్వారా ఏర్పాటైన నాయకత్వంలో పార్టీ బాగుంటుందన్నారు. పార్టీ బాగుకోసమే సోనియా గాంధీకి లేఖ రాసినట్లు పేర్కొన్నారు. ఎన్నికలు నిర్వహిస్తే ఓడిపోతామనుకునే వారే తన విధానాన్ని వ్యతిరేకిస్తున్నారని అన్నారు. పార్టీలో కేవలం ఇద్దరు లేదా ముగ్గురి మధ్యే పోటీ ఉంటుందని, వారిలో 51 శాతం ఓట్లు వచ్చిన వ్యక్తి ఎన్నికవుతాడని, అప్పుడు అతని వెంట 51 శాతం మంది ప్రజలు ఉన్నట్టేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయి అధ్యక్షుడిని నియమించి, పార్టీలో నూతన జవసత్వాలు నింపాలంటూ ఇటీవల ఆ పార్టీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మంది ‘‘అసమ్మతి’’ నేతల్లో ఆజాద్ కూడా ఉన్న విషయం తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.