ప్రయివేటులో టీకా.. డోసుకు రూ. 250
న్యూఢిల్లీ : ప్రయివేటు ఆసుపత్రుల్లో కరోనా టీకాకు సంబంధించి కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఒక్కో డోసు ధరను రూ.250గా నిర్ణయించింది. ఇందులో వ్యాక్సిన్ ధరతోపాటు సర్వీసు ఛార్జి ఇమిడి ఉంటాయి. వ్యాక్సిన్ ధర రూ. 150 కాగా సర్వీసు ఛార్జిగా ఒక్కో వ్యక్తి నుంచి రూ. 100 ప్రయివేటు ఆస్పత్రులు వసూలు చేస్తాయని కేంద్రం పేర్కొంది. కరోనా టీకా రెండు డోసుల్లో వేసుకోవాల్సి ఉండడంతో ప్రయివేటులో ఒక్కో వ్యక్తికి రూ. 500 ఖర్చు చేయాల్సి ఉంటుంది.
అలాగే ఇక మార్చి 1 నుంచి ప్రారంభమయ్యే మూడో దశ వ్యాక్సినేషన్స్కు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. 60 ఏళ్ల పైబడిన వారు, 45-60 ఏళ్ల మధ్యన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి వ్యాక్సిన్ వేయాలని కేంద్రంనిర్ణయించింది. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.