Corona: ఐసోలేషన్ కేంద్రాలుగా రైల్వే బోగీలు

న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలో రోజురోజుకి కేసులు పెరిగిపోతున్నాయి. ఓపైపు ఆసుపత్రుల్లో బెడ్లు లేక, ఆక్సిజన్ లేక రోగులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో రెల్వే శాఖ మళ్లీ ముందుకు వచ్చింది. కరోనా మహమ్మారి మొదటి విడుతలో ఆసుపత్రుల్లో బెడ్ల కొరతతో కోచ్లను ఐసోలేషన్ కేంద్రాలుగా మార్చింది రైల్వే శాఖ. సెకండ్ వేవ్లో కరోనా పంజా విసురుతుండడంతో ఇప్పటికే రాష్ట్రాల్లోని హాస్పిటళ్లలో పడకలు నిండిపోయాయి. ఈ క్రమంలో మరోసారి రైల్వే ముందుకు వచ్చింది. ప్రస్తుతం దేశంలో 3,816 రైల్వే కోచ్లను కొవిడ్-19కేర్ కోచ్లుగా మార్చినట్లు రైల్వేశాఖ ప్రకటించింది. ఆరోగ్య సంరక్షణ చర్యల్లో భాగంగా మొత్తం 5,601 రైల్ కోచ్లను కొవిడ్ కేర్ సెంటర్లుగా మారుస్తున్నట్లు రైల్వే శాఖ పేర్కొంది. ప్రస్తుతం 3,816 కోచ్లు వినియోగానికి అందుబాటులో ఉన్నాయని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాల డిమాండ్ మేరకు కోచ్లను మోహరిస్తున్నట్లు రైల్వే మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ మేరకు మహారాష్ట్రలోని నందూర్బార్ జిల్లాలో 21 కొవిడ్ -19 కేర్ కోచ్లను మోహరించినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. షుకుర్ బస్తీ వద్ద 25, ఆనంద్ విహార్లో 25, వారణాసిలో 10, భడోహిలో 10, ఫైజాబాద్ వద్ద 10 కొవిడ్-19 కేర్ కోచ్లను అందుబాటులో ఉంచినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. తేలిక పాటి కరోనా బాధితులకు సేవలందించేందుకు ఈ కోవిడ్ కోచ్లను ఉపయోగించుకోవచ్చని రైల్వే అధికారులు వెల్లడించారు.