Mancherial: Remdesivir అక్రమ దందా ముఠా సభ్యుల అరెస్టు
మంచిర్యాల (CLiC2NEWS): రాష్ట్రంలో కరోనా సెకండ్ విజృంభిస్తున్న వేళ మహమ్మారి వ్యాప్తిని ఆసరా చేసుకుని కొందరు రెమ్డెసివర్ ఇంజక్షన్ను బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రమయిస్తున్నారు. తాజాగా రెమ్డెసివర్ ఇంజక్షన్ను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్న ముఠాను మంచిర్యాల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంచిర్యాలలోని ప్రైవేట్ హాస్పిటల్స్ కేంద్రంగా అంబులెన్స్ డ్రైవర్ల ద్వారా సాగుతున్న దందా గుట్టును పోలీసులు రట్టు చేశారు. మంచిర్యాల ఏసీపీ అఖిల్ మహాజన్ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.
మంచిర్యాలలోని 2 ప్రైవేట్ దవాఖానలకు చెందిన ఇద్దరు సిబ్బంది, ఇద్దరు అంబులెన్స్ యజమానులు గ్రూపుగా ఏర్పడి నెల రోజులుగా బ్లాక్ దందా నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఒక్కో ఇంజక్షన్ ను రూ. 25 నుంచి రూ. 30 వేల వరకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని, అంబులెన్స్, 5 రెమిడెసివర్ ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ అఖిల్ మహాజన్ తెలిపారు.