జలమండలి వర్షాకాల ముందస్తు కార్యాచరణ

హైదరాబాద్ (CLiC2NEWS): వర్షాకాల కార్యాచరణ, సెవరెజీ ఓవర్ ఫ్లో, మంచినీటి సరఫరా వంటి విషయాలపై జలమండలి ఎండీ ఎం. దానకిషోర్, ఐఏఎస్ మంగళవారం ఖైరతాబాద్ లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలం రానుండడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కువ లోతు ఉన్న మ్యాన్ హోళ్ళపై తప్పనిసరిగా మూతలు (సేఫ్టీ గ్రిల్స్) ఉంచాలని అన్నారు. డ్రైనేజీ పనులకు సంబంధించిన శిథిలాలు ఉంటే తక్షణం తొలగించాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా నోడల్ ఆఫీసర్లను నియమించి మూడు షిప్ఠుల్లో పనిచేసే విధంగా చూడాలని, ఎమర్జెన్సి రెస్పాన్స్ టీమ్ 24 గంటలు అందుబాటులో ఉంచాలని ఆయన పేర్కొన్నారు. వాటర్ బోర్డు, జీహెచ్ ఎంసీ లోని వాటర్ లాగింగ్ పాయింట్లను నిత్యం పర్యవేక్షించాలని తెలిపారు. క్షేత్రస్థాయి సిబ్బంది, అధికారులు ప్రత్యేక శ్రద్ద చూపి మంచి పనితీరు ప్రదర్శించారని తెలిపారు.
క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే సిబ్బంది ఆరోగ్యం పట్ల ప్రతిరోజు మేనేజర్లు శ్రద్ధ చూపాలని తెలిపారు. సిబ్బంది శానిటైజర్, మాస్కులు తప్పనిసరిగా వాడాలని ఆదేశించారు. సెవరెజీ ఓవర్ ఫ్లో, కలుషిత నీటిపై వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. తరచుగా సెవరెజీ ఓవర్ ఫ్లో అయ్యే ప్రాంతాలను గుర్తించి మ్యాన్ హోళ్లు ఉప్పొంగకుండా ముందస్తు నిర్వహణ చర్యలు చేపట్టాలన్నారు.
వర్షాకాల ముందస్తు ప్రణాళిక -2021
రానున్న వర్షాకాలంలో నగరప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటీకే నగరంలోని లోతు గల మ్యాన్ హోళ్లకు సెఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే రూ. 8 కోట్ల వ్యయంతో.. ధ్వంసమైన, రోడ్డుకు సమాంతరంగా లేని 10,120 మ్యాన్ హోళ్లకు మరమ్మత్తులు చేపట్టినట్లు తెలిపారు.
వర్షాకాలంలో అత్యవసర పనులు చేపట్టేందుకు ప్రతీ డివిజన్ కు ఈఆర్టీ బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అత్యవసర సీవరేజి ఓవర్ ఫ్లో సమస్యలను పరిష్కరించడానికి ప్రతీ డివిజన్ కు ఒక అదనపు మినీ ఎయిర్ టెక్ మిషన్ ను ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. అలాగే నగరంలో వర్షాకాలంలొ నీళ్లు నిలిచే 140 ప్రాంతాల్లో మ్యాన్ హోళ్లకు సెఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు చేశామన్నారు. అలాగే వర్షం వచ్చే సమయంలో సెవరెజీ సూపర్ వైజర్లను నియమించి ప్రత్యేక దృష్టి చూపాలని అధికారులను ఆదేశించారు. లోతుగా ఉన్న మ్యాన్ హోళ్ల దగ్గర హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పనిచేసే ప్రతి ఒక్క సిబ్బంది, అధికారి జలమండలి యూనిఫాం కోట్ ధరించాలని ఎండీ ఆదేశించారు. అలాగే మంచినీటి పైపు నాలా క్రాసింగ్ వద్ద చెత్త చేరకుండా జీఎమ్ లు అప్రమత్తంగా ఉండాలన్నారు.
నగర ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లోనైనా మ్యాన్ హోల్ మూతలను తెరవకూడదని సూచించారు. ఎక్కడైనా మ్యాన్ హోల్ మూత ధ్వంసమైన, తెరిచి ఉంచినట్లు తెలిస్తే జలమండలి కస్టమర్ కేర్ నెంబర్ 155313 కి కాల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు.
అనంతరం జలమండలి నగర వాసులకు ఉచిత మంచినీటి పథకం పురోగతిని రెవెన్యూ తదితర అంశాలపై సమీక్షించారు.
ఈ సమావేశంలో జలమండలి ఈఎన్సీ, ఆపరేషన్స్ డైరెక్టర్ అజ్మీరా కృష్ణ, రెవెన్యూ డైరెక్టర్ వి. ఎల్ . ప్రవీణ్ కుమార్ లతో పాటు ఓ అండ్ ఎమ్ సీజీఎమ్ లు, జీఎమ్ లు పాల్గొన్నారు.