రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు

హైదరాబాద్ (CLiC2NEWS): కాకతీయ అద్భుత శిల్ప కళా నైపుణ్యానికి చిరునామా రామప్ప ఆలయం. తెలంగాణలోని ములుగు జిల్లా లో ఉన్న రామప్ప దేవాలయానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ప్రపంచ వారసత్వ స్థలంగా యునెస్కో గుర్తించింది. చైనాలోని ఫ్యూజులో జరిగిన ప్రపంచ వారసత్వ కమిటీ వర్చువల్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మన దేశం నుంచి 2020 సంవత్సరానికి రామప్పకు మాత్రమే ఈ ఖ్యాతి దక్కింది.
పాలంపేటలో 800 ఏళ్ల కాలం నాటిది రామప్ప. ఇది క్రీ శ. 1213లో నిర్మితమైంది. పూర్వపు వరంగల్ జిల్లా కేంద్రానికి 70 కిలోమీటర్ల దూరంలో (ప్రస్తుత ములుగు జిల్లా) పాలంపేట గ్రామంలో ఉంది. రామప్ప దేవాలయం. ఈ అపురూప శిల్పాలయాన్ని క్రీ.శ. 1213లో కాకతీయ ప్రభువు గణపతిదేవుని సైన్యాధ్యక్షుడు రేచర్ల రుద్రుడు కట్టించాడు. శిల్పి రామప్ప పేరుతో ఈ కాకతీయ కట్టడం ప్రాచుర్యంలోకి వచ్చింది.