TS: ఈ నెల 16 నుంచి దళితబంధు అమలు: సిఎం కెసిఆర్
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకం అమలు విధివిధానాలపై మంత్రి వర్గం చర్చించింది. ఆదివారం సీఎం కేసీఆర్ అధ్యక్షత ప్రగతి భవన్లో రాష్ట్రవర్గం సమావేశమైంది. ఈ సందర్భంగా పలు అంశాలపై సీఎం చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఈ సమావేశంలో దళిత బంధు పూర్వాపరాలను ఈ సందర్భంగా మంత్రులకు సిఎం వివరించారు. ఈ మేరకు ఈ నెల 16వ తేదీ నుంచి దళిత బంధు పథకం ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దళిత బంధు ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్న సంగతి తెలిసిందే.
57 ఏండ్ల వారికి త్వరలో పింఛన్
వృద్ధాప్య పింఛన్ అర్హత వయస్సును 57 ఏండ్లకు తగ్గిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 57 ఏండ్లు నిండిన వారందరికీ పింఛన్ అందించేందుకు తక్షణమే చర్యలు ప్రారంభించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ నిర్ణయంతో మరో 6,62,000 కొత్తగా పింఛన్లు అందనున్నాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పింఛన్ లబ్ధిదారుల సంఖ్య 58 లక్షలకు పెరగనుంది. కుటుంబంలో ఒక్కరికే పింఛన్ పద్ధతిని కొనసాగిస్తూ.. భర్త చనిపోతే భార్యకు భార్య చనిపోతే భర్తకు వెంటనే పింఛన్ బదిలీ చేయాలని, ఈ ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు.