డిప్యూటీ చైర్మన్పై ఆవిశ్వాస తీర్మానం!
నోటీసు ఇచ్చిన 12 పార్టీలు
న్యూఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్పై ప్రతిపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చాయి. వ్యవసాయ బిల్లులను కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా ఆమోదింపజేసుకునేందుకు ఆయన సహకరించారని ఆరోపిస్తూ 12 పార్టీలు కలిసి అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చినట్లు కాంగ్రెస్ ఎంపి అహ్మద్ పటేల్ తెలిపారు. కాంగ్రెస్, టిఆర్ ఎస్, సిపిఐ, సిపిఎం, ఆర్జేడీ తదితర పార్టీలు ఈ నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. ఈ రోజు రాజ్యసభలో విపక్షాల ఆందోళన మధ్య వ్యవసాయ బిల్లులకు ఆమోదం లభించిన నేపథ్యంలో పెద్దల సభలో రేగిన దుమారం కొనసాగుతోంది. ప్రజాస్వామిక విలువలను, సంప్రదాయాలను పరిరక్షించాల్సిన హరివంశ్ ప్రజాస్వామిక విలువలకు తూట్లుపొడిచారాని, ఆయనకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని తాము నిర్ణయించామని కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ వెల్లడించారు. విపక్షాల ఆందోళనలను విస్మరిస్తూ రైతు వ్యతిరేక వ్యవసాయ బిల్లులను ఆమోదించడం ద్వారా పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం ఖూనీ చేసిందని తృణమూల్ ఎంపీ డెరెక్ ఓబ్రెన్ ఆరోపించారు.విపక్ష ఆందోళనలను కప్పిపుచ్చేందుకు ప్రత్యక్ష ప్రసారాన్ని నిలిపివేసి ప్రభుత్వం బిల్లులను ఆమోదింపచేసుకుందని విమర్శించారు.
సభ్యులపై చర్యలు?
రాజ్యసభలో జరిగిన పరిణామాలపై చైర్మన్ వెంకయ్యనాయుడు నివాసంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి, సహాయ మంత్రులు, రాజ్యసభ డిప్యూటీ నేత పీయూష్ గోయల్, ఇరు సభల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇక గురువారం లోక్సభ ఆమోదించిన వ్యవసాయ బిల్లులను విపక్షాల ఆందోళన మధ్య ఆదివారం రాజ్యసభ ఆమోదించింది.
Comments are closed.