రిజ‌ర్వాయ‌ర్ల వ‌ద్ద భ‌ద్ర‌త క‌ట్టుదిట్టం చేసిన జ‌ల‌మండ‌లి

కొత్త‌గా 100 మంది సెక్యూరిటీ గార్డు‌లు

 

రిజ‌ర్వాయ‌ర్ల వ‌ద్ద‌కు ఇత‌రుల‌కు నో ఎంట్రీ

కొత్త సెక్యూరిటీ గార్డుల‌ నియామకం

సెక్యూరిటీ గార్డుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించిన అధికారులు

 హైద‌రాబాద్‌(CLiC2NEWS): న‌గ‌రంలోని రిజ‌ర్వాయ‌ర్ల వ‌ద్ద జ‌ల‌మండ‌లి భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేసింది. రిజ‌ర్వాయ‌ర్ల వ‌ద్ద నిరంత‌రం ప‌హారా ఉంచేందుకు గానూ ప్రైవేటు ఏజెన్సీ ద్వారా కొత్త‌గా 100 మంది సెక్యూరిటీ గార్డుల‌ను నియ‌మించింది. వీరంతా న‌గ‌రంలోని వివిధ రిజ‌ర్వాయ‌ర్ల వ‌ద్ద 24 గంట‌ల పాటు విధులు నిర్వ‌హించ‌నున్నారు. వీరు జ‌ల‌మండ‌లి విజిలెన్స్ విభాగంతో పాటు స్థానిక‌ పోలీసుల‌ స‌మ‌న్వ‌యంతో ప‌ని చేయ‌నున్నారు. కొత్త సెక్యూరిటీ గార్డుల‌కు శుక్ర‌వారం ఖైర‌తాబాద్‌లోని జ‌ల‌మండ‌లి ప్ర‌ధాన కార్యాల‌యంలో ఉన్న‌తాధికారులు అవ‌గాహ‌న క‌ల్పించారు.

ఈ సంద‌ర్భంగా జ‌ల‌మండ‌లి ఈడీ డా.ఎం.స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ… రిజ‌ర్వాయ‌ర్ల వ‌ద్ద‌కు బ‌య‌టి వ్య‌క్తుల‌ను అనుమ‌తించ‌వ‌ద్ద‌ని సెక్యూరిటీ సిబ్బందికి సూచించారు. అయితే, జ‌ల‌మండ‌లి వినియోగ‌దారులు, సాధార‌ణ ప్ర‌జ‌లు ఏదైనా స‌మ‌స్య‌లు ఉంటే ప‌రిష్క‌రించుకోవ‌డానికి మాత్రం ఆఫీసు స‌మ‌యాల్లో అధికారుల‌ను క‌లిసే వెసులుబాటు ఉంటుంద‌న్నారు. రిజ‌ర్వాయ‌ర్ల ప్రాంగ‌ణాల్లో ఎటువంటి అసాంఘిక కార్య‌క్ర‌మాలు జ‌ర‌గ‌కుండా నిత్యం జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ఆదేశించారు. ఏవైనా స‌మ‌స్య‌లు ఉంటే వెంట‌నే జ‌ల‌మండ‌లి విజిలెన్స్ విభాగానికి, స్థానిక పోలీసుల‌కు వెంట‌నే స‌మాచారాన్ని అందించాల‌ని పేర్కొన్నారు. రిజ‌ర్వాయ‌ర్ల వ‌ద్ద లాగ్‌బుక్‌ల‌ను ఏర్పాటు చేయాల‌ని, ఈ ప్రాంగ‌ణాల్లోకి వ‌చ్చే ఉద్యోగుల‌తో పాటు అంద‌రి వివ‌రాల‌ను క‌చ్చితంగా వీటిల్లో న‌మోదు చేయాల‌ని సూచించారు. అనంత‌రం కొత్త సెక్యూరిటీ గార్డులు ఖైర‌తాబాద్ జ‌ల‌మండ‌లి ప్ర‌ధాన కార్యాల‌యం ముందు మార్చ్‌ఫాస్ట్ నిర్వ‌హించి ఆయా రిజ‌ర్వాయ‌ర్ల వ‌ద్ద విధుల్లో చేరారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆప‌రేష‌న్స్ డైరెక్ట‌ర్లు అజ్మీరా కృష్ణ‌, స్వామి, చీఫ్ విజిలెన్స్ ఆఫీస‌ర్ ర‌విచంద్ర‌న్‌రెడ్డి, సీజీఎం విజ‌య‌రావు, ఎజైల్ సెక్యూరిటీ సంస్థ ప్ర‌తినిధులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.