ఎస్టీపీల నిర్మాణాన్ని సందర్శించిన జలమండలి ఎండి

హైదరాబాద్ (CLiC2NEWS): ఎస్టీపీల నిర్మాణ ప్రాజెక్టు ప్యాకేజ్ – 3లో భాగంగా ఫతేనగర్, ప్రగతినగర్, దుర్గం చెరువులో నిర్మిస్తున్న సీవరేజి ట్రీట్మెంట్ ప్లాంట్ల(ఎస్టీపీ) నిర్మాణ పనులను గురువారం జలమండలి ఎండీ దానకిశోర్ పరిశీలించారు. నిర్మాణం జరుగుతున్న తీరును ఆయన అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. దసరాలోపు ఎస్టీపీల నిర్మాణం పూర్తయ్యేందుకు గానూ 24 గంటల పాటు పనులు జరపాలని, ఇందుకోసం 3 షిఫ్టుల్లో కార్మికులు పని చేసేలా చూసుకోవాలని సూచించారు. అన్ని ఎస్టీపీల నిర్మాణ పనులు దశలవారీగా కాకుండా ఏకకాలంలో జరగాలని, ఇందుకు తగిన కార్మికులు, యంత్రాలు, సామాగ్రిని సిద్ధం చేసుకోవాలని ఆయన ఆదేశించారు.
ఎస్టీపీ ప్రాంగణంలో మూడు షిఫ్టుల్లో సైట్ ఇంజనీర్లు కచ్చితంగా పనులను పర్యవేక్షించాలని నిర్మాణ సంస్థ ప్రతినిధులకు ఆదేశించారు. ఎస్టీపీ నిర్మాణ పనుల్లో నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడొద్దని ఆయన స్పష్టం చేశారు. రాత్రి వేళల్లో పనులు జరుపుతున్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, సరిపడా వెలుతురు ఉండేలా ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేయాలని చెప్పారు. నిర్మాణ ప్రదేశంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్మికులు కచ్చితంగా రక్షణ పరికరాలను ఉపయోగించేలా చూడాలని ఆయన సూచించారు. నిర్మాణ పనుల వల్ల ఎవరికీ ఇబ్బంది కలగకుండా చుట్టూ బ్లూషీట్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఎస్టీపీ ప్రాంగణంలో వివిధ దశల నిర్మాణ పనుల వివరాలతో కూడిన సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని ప్రత్యేకంగా చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఈడీ డా.ఎం.సత్యనారాయణ, ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్ బాబు, ఎస్టీపీ విభాగ ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.