సంతోషకరమైన క్షణంః ఎల్.కే. అద్వానీ
చారిత్రాత్మక నిర్ణయం : మురళీ మనోహర్ జోషి

న్యూఢిల్లీ : ఎన్నో ఏళ్ల నుంచి ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో లక్నోలోని సీబీఐ కోర్టు తీర్పును బుధవారం వెలువరించిన విషయయం తెలిసిందే. బాబ్రీ మసీదు కూల్చివేత ముందుగా అనుకున్న పథకం ప్రకారం చేసింది కాదు అని కోర్టు తీర్పునిచ్చింది. 2000 పేజీల తీర్పును న్యాయమూర్తి సురేంద్ర కుమార్ యాదవ్ చదివి వినిపించారు. దీంతో ప్రధాన నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్న ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతీ సహా 32 మంది నిందితులు నిర్దోషులుగా తేలారు. దీనిపై బీజేపీ సీనియర్ నేత ఎల్.కే. అద్వానీ సంతోషం వ్యక్తం చేశారు.
‘‘మా అందరికీ సంతోషకరమైన క్షణం. ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా. చాలా రోజుల తర్వాత అద్భుతమైన వార్త అందింది. ఒక్కటి మాత్రమే చెప్పగలుగుతా. ‘‘జైశ్రీరాం. ఇచ్చిన తీర్పు చాలా ముఖ్యమైంది. రామ జన్మభూమి ఉద్యమం పట్ల నా వ్యక్తిగత నిబద్ధత, పార్టీ నిబద్ధతను ఈ తీర్పు నిరూపిస్తుంది.’’ అని సంతోషం వ్యక్తం చేశారు.
చారిత్రాత్మక నిర్ణయం : మురళీ మనోహర్ జోషి
‘‘ఈ తీర్పు చారిత్రాత్మక నిర్ణయం. డిసెంబర్ 6 న అయోధ్యలో జరిగిన సంఘటనలో ఎలాంటి కుట్ర జరగలేదని రుజువు చేస్తోంది. తాము చేపట్టిన ర్యాలీల్లో, కార్యక్రమాల్లో కుట్ర లేదు. మేము చాలా సంతోషంగా ఉన్నాం. అందరూ రామ మందిర నిర్మాణంపై ఆసక్తిగా ఉన్నాం.’’ అని మనోషర్ జోషి పేర్కొన్నారు.
(తప్పక చదవండిః బాబ్రీ కూల్చివేత నిందితులంతా నిర్దోషులే!)
బాబ్రీ తీర్పు.. కోర్టుకు వెళ్లని అద్వానీ.. 26 మంది హాజరు
దేశ వ్యాప్తంగా బాబ్రీ మసీదు కూల్చివేత సంబంధం ఉన్న 32 మంది కోర్టుకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. కానీ ఆరు మంది కోర్టుకు హాజరుకావడం లేదు. వారిలో అద్వానీ, జోషి, ఉమాభారతిలు ఉన్నారు. వీరు భౌతికంగా కోర్టుకు వెళ్లడం లేదు. అడిషనల్ జిల్లా, సెషన్స్ జడ్జి ఎస్కే యాదవ్ ఈ కేసులో తీర్పు ఇవ్వనున్నారు. మే 2017 నుంచి రోజు వారీగా యాదవ్ కేసును విచారించారు. అయితే తుది తీర్పు రోజున నేరాభియోగం ఎదుర్కొంటున్న వారంతా కోర్టులో భౌతికంగా హాజరుకావాలంటూ ఆదేశించారు. కానీ ఇవాళ ఆరు మంది కోర్టుకు హాజరుకావడం లేదు. నృత్య గోపాల్ దాస్, కళ్యాణ్ సింగ్, సతీష్ ప్రదాన్లు హాజరుకాని వారిలో ఉన్నారు.