సోనూ సూద్కు ఐరాస పురస్కారం

హైదరాబాద్: కరోనాకి ముందు సోనీ సూద్ ఒక నటుడుగానే తేలుసు.. ఇప్పుడు దేశమంతా సోనూ సూద్ రియల్ హీరోగా తెలుసు. కులం, మతం, ప్రాంతం తేడా లేకుండా కష్టంలో ఉన్నామని మెస్సేజ్ చేస్తే క్షణాల్లో స్పందించి కోట్లాది మంది హృదయాల్లో చెరగని ముద్రవేసుకున్న సోనూ సూద్కు అరుదైన పురస్కారం లభించింది. ఆయన మానవతా దృక్పథానికి ఏకంగా ఐక్యరాజ్య సమితి గుర్తించింది. ఐరాస అనుబంధ సంస్థ ఐక్యరాజ్య సమితి అభివృద్ధి ప్రోగ్రాం.. సోనూ సూద్కు స్పెషల్ హ్యూమానిటేరియన్ యాక్షన్ అవార్డును అందజేసింది. దీంతో ఈ అరుదైన అవార్డు అందుకున్న ఏంజెలీనా జోలీ, డేవిడ్ బెక్హాం, లియానార్డో డీ కాప్రికోల సరసన సోనూ చేరారు. వర్చువల్ విధానంలో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్న సోనూ ‘‘ఇది అరుదైన, గొప్ప గౌరవం. ఐరాస గుర్తింపు ప్రత్యేకమైనది. నేను చేసిన సాయం చాలా చిన్నదిగా భావిస్తున్నాను’’ అన్నారు. కాగా రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో సోనూ సూద్ పాల్గొన్నారు. సినీ దర్శకుడు శ్రీను వైట్ల ఇచ్చిన ఛాలెంజ్ను స్వీకరించి రామోజీ ఫిలిం సిటీలో మొక్కలు నాటారు.
ల్యాప్ టాప్ కంపెనీకు బ్రాండ్ అంబాసిడర్గా సోనూసూద్
సోనూసూద్ క్రేజ్ దేశ వ్యాప్తంగా పాకింది. అయితే ఇది క్యాష్ చేసుకోవాలనుకున్న ప్రముఖ ల్యాప్ ట్యాప్ కంపెనీ ఏసర్ ఇండియా సోనూసూద్ను తమ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకుంది. సోనూసూద్ వంటి మానవతావాది తమ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ కావడం ఎంతో ఆనందంగా ఉందని ఏసర్ ఇండియా భావిస్తోంది. అంతేకాదు కొత్త టెక్నాలజీల గురించి ఆయన వివరించడం తమ సంస్థకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని అంటుంది.