సినీగేయ రచయిత కందికొండ యాదగిరి మృతి
హైదరాబాద్ (CLiC2NEWS): ‘మళ్లికూయవే గువ్వా” పాటతో సినీ గేయ రచయితగా మారిన కందికొండ యాదగిరి అనారోగ్యంతో కన్నమూశారు. గత కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం మృతిచెందారు. ఆయన 2001 పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ చిత్రంలో ‘మళ్లికూయవే గువ్వా’ పాటతో చిత్ర పరిశ్రమ గేయ రచయితగా పరిచయమయ్యారు. మంచి మెలోడి గీతంగా ఆపాట శ్రోతలను ఎంతగానో అలరించింది. ‘ఇడియట్’ చిత్రంలో ‘చూపుల్తో గుచ్చి గుచ్చి’, ‘సత్యం’ లో ‘మధురమే మధురమే’, ‘ఐయామ్ ఇన్ లవ్’, ‘పోకిరి’ చిత్రంలో ‘గల గల పారుతున్న గోదారిలా’ , ‘జగడమే’ పాటలు ‘లవ్లీ’లో ‘లవ్లీ లవ్ లీ’ తదితర పాటలు రాశారు. చివరగా 2018 లో ‘నీది నాది ఒకే కథ’ లో రెండు పాటలు రాశారు. కందికొండ మొత్తంగా 1300లకు పైగా పాటలు రాశారు. మొదటగా జానపద గీతాలను రాసే కందికొండ , సంగీత దర్శకుడు చక్రి ప్రోత్సాహంతో సినిమా పాటలు రాశారు.
కంది కొండ కొన్నాళ్లుగా క్యాన్సర్తో పోరాడి జయించినా, వెన్నెముక సమస్య తలెత్తడంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కున్నారు. తెలంగాణ ప్రభుత్వం, స్నేహితుల సహకారంతో ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకున్నా,పూర్తిగా కోలుకోలేదు. కంది కొండ మృతి పట్ల సినీ పరిశ్రమ కు చెందిన పలువురు విచారం వ్యక్తం చేశారు.