దళితుల జీవితాల్లో ‘దళిత బంధు’ ఒక నవశకం: ఎమ్మెల్యే బాల్కసుమన్
హైదరాబాద్ (CLiC2NEWS): దళిత జాతి అభ్యున్నతి కోసం ఒక సువర్ణ అధ్యాయాన్ని కెసిఆర్ లిఖించారని ఎమ్మెల్యే బాల్కసుమన్ తెలిపారు. హెచ్ఐసిసిలో నిర్వహిస్తున్న టిఆర్ఎస్ ప్లీనరీ వేదికగా బాల్కసుమన్ మాట్లాడుతూ.. దేశంలో అత్యంత వెనుకబడిన జాతి దళిత జాతి అని తెలిపారు. గబ్బిలం కావ్యంలో గుర్రం జాషువా చెప్పినట్లు.. భారతావని దళితజాతికి బాకీ పడింది. అది పూర్తి స్తాయిలో గుర్తించిన మహానుభావుడు కెసిఆర్ అని, దళితబంధు పథకం దళిత జాతి కోసం తీసుకొచ్చారన్నారు.
కొత్తగా ఎమ్మెల్యే ఎన్నికైనపుడే సిద్దిపేటలోని దళితుల అభ్యున్నతి కోసం దళిత చైతన్య జ్యోతి అనే కార్యక్రమాన్ని అమలు చేశారని, సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ కమిటి ఛైర్మన్ పదవిని దానయ్య అనే దళితుడికి ఇచ్చి ఉమ్మడి ఎపి రాజకీయాల్లో విప్లవం సృష్టించారని ఈసందర్భంగా గుర్తుచేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలో ఎక్కడా లేని విధంగా గురుకులాలు, అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకాలు అమలు చేస్తున్నారన్నారు.