నాగార్జున సాగర్లో ఘనంగా బుద్ధుని జయంతి వేడుకలు..
నాగార్జున సాగర్ (CLiC2NEWS) రాష్ట్రంలోని నాగార్జున సాగర్లో ఉన్న బుద్ధ వనంలో బుద్ధుని జయంతి వేడుకలు కనులపండువగా నిర్వహించారు. టిబెట్, మైసూర్తో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బౌద్ధ భిక్షువులు, బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లెపల్లి లక్ష్మయ్య, బుద్ధుని పాదుకలవద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
బౌద్ధమత గురువు సంఘబాల మాట్లాడుతూ.. బుద్దుని జీవిత విశేషాలను,జీవిత సత్యాలను కండ్లకు కట్టినట్లు వీక్షించేలా బుద్ధవనాన్ని తీర్చిదిద్దారని , ప్రపంచ బౌద్ధులకు ఇది పవిత్ర భూమిగా మారిందని తెలిపారు. బుద్ధవనం నేడు అంతర్జాతీయ స్థాయి బౌద్ధ క్షేత్రంగా వర్ధిల్లుతుందని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో హర్యానా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ ఉండ్ర, బుద్ధవనం ఆర్కిటెక్ట్ శ్యాం సుందర్, ప్రొఫెసర్ సంతోష్ రావు తదితరులు పాల్గొన్నారు.