నిఘా నేత్రం నీడలో మంచిర్యాల పట్టణం..

75 సిసి కెమెరాల‌ను ప్రారంభించిన సిపి ఎస్‌ చంద్రశేఖర్ రెడ్డి

మంచిర్యాల (CLiC2NEWS): పట్టణ కేంద్రంలోని ప్రధాన కూడళ్లలో మున్సిపాలిటీ నిధుల నుండి అత్యాధునిక టెక్నాలజీతో ఏర్పాటు చేసిన 75 సిసి కెమెరాలను మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ అవరణలో రామగుండం పోలీస్ కమీషనర్ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే దివాకర్ రావు, మంచిర్యాల ఇంచార్జ్ డిసిపి అఖిల్ మహాజన్‌లతో కలిసి ప్రారంభించారు.

ఈసందర్భంగా సిపి ఎస్‌ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. పోలీసు వ్యవస్థను పటిష్టం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఎక్కడ ఎలాంటి నేరాలు జరిగినా తక్షణమే స్పందించేలా పట్టణం మొత్తంగా రైల్వేస్టేషన్, బస్టాండ్ ఏరియా, బెల్లంపల్లి చౌరస్తా, ముఖరం చౌరస్తా, బైపాస్‌ రోడ్, ఏసీసీ చౌరస్తా, ఓవర్‌ బ్రిడ్జి ఏరియా, ఐబీ ఏరియా, మార్కెట్‌ రోడ్, గంగారెడ్డిరోడ్, వాటర్‌ ట్యాంక్ చౌరస్తా, కాలేజ్‌ రోడ్‌తో పాటు గోదావరి తీరంలో కెమెరాలను ఏర్పాటు చేశామ‌న్నారు. 75 కెమెరాల‌ ఏర్పాటు చేసి పట్టణంని నిఘా నేత్రల నీడ లో నేరాల నియంత్రణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ పై పోలీసు శాఖ దృష్టి సారించింది అన్నారు. పట్టణం లో ఈ కెమెరాలు నిరంతరం 360 డిగ్రీల్లో తిరుగుతూ ప్రతీ దృశ్యాన్ని రికార్డు చేస్తాయని అన్నారు. వీటి ద్వారా వంద మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిన వెంటనే గుర్తించి పరిష్కరించవచ్చు. రాత్రి వేళల్లోనూ దృశ్యాలను స్పష్టంగా చిత్రీకరిస్తాయని నేరస్తులను గుర్తించడానికి, ఏదైనా సంఘటన జరిగిన వెంటనే నేరస్తులను పట్టుకోవడానికి ఈ కెమెరాలు ఉపయోగపడుతాయని సిపి అన్నారు.

క్రైమ్‌, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ విభాగాల నుంచి పోలీస్ సిబ్బంది కంట్రోల్ రూంలో సీసీ కెమెరాల దృశ్యాలను విశ్లేషిస్తుంటారని సిపి తెలిపారు. నేరాలపైనే కాకుండా ట్రాఫిక్ సమస్యలపై నిఘా పెడుతూ విధుల్లో ఉన్న ట్రాఫిక్, పోలీస్ సిబ్బందికి కంట్రోల్ రూం ద్వారా ఆదేశాలు జారీ చేస్తూ పరిస్థితులను అదుపు చేసేలా కార్యాచరణ చేపట్టామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎసిపి తిరుపతి రెడ్డి, సిఐ నారాయణ, మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, మున్సిపల్ కమీషనర్ బాలకృష్ణ, ట్రాఫిక్ సిఐ నరేష్, ఎస్ఐలు, పోలిస్ సిబ్బంది పాల్గొన్నారు..

 

Leave A Reply

Your email address will not be published.