Ramagundam: పోలీసు సిబ్బందికి సేవా పురస్కారాలు
సేవా, ఉత్క్రిష్ట , అతిఉత్క్రిష్ట సేవా పతకాలు అందజేసిన సిపి ఎస్. చంద్రశేఖర్ రెడ్డి
రామగుండం (CLiC2NEWS): రామగుండం పోలీస్ కమీషనరేట్లో 39 మందికి పోలీస్ సేవా పతకాలు అందించారు. 2019, 2020,2021 సంవత్సరానికి గాను విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసులకు తెలంగాణ ప్రభుత్వం సేవా పతకాలను ప్రకటించింది.
ఈ సందర్భంగా సిపి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ప్రజా రక్షణ, విధి నిర్వహణలో అసామాన్యమైన ప్రతిభను కనబర్చిన పోలీస్ సిబ్బందికి గుర్తింపునిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సేవా పతకాలను ఇస్తున్నాయి అన్నారు. పోలీసు సిబ్బందికి పోలీస్ సేవా పతకాలు ఇవ్వడం ద్వారా పోలీసుల్లో స్ఫూర్తిని నింపడంతో పాటు వారి పని తీరును మెరుగు పర్చవచ్చన్నారు.
ప్రతీ ఒక్క పోలీస్ ఉద్యోగి రిటైర్ అయ్యే లోపు పతకాలు సాధించాలని, సేవా పతకాలను అందుకోవడం వల్ల సిబ్బందిలో ఉత్సాహాన్ని నింపడంతో పాటు తోటి వారికి ఆదర్శంగా నిలుస్తారన్నారు. సేవా పతకాలు అందుకున్న వారు ఇంతటితో ఆగకుండా రెట్టింపు ఉత్సాహంతో పని చేసి మరిన్ని పతకాలను సాధించాలన్నారు.