రహదారిపై అడ్డగోలుగా తవ్వకాలు..

ఇబ్బందిపడుతున్న కాలనీవాసులు..

మండపేట: మండపేట పట్టణంలోని రెండో వార్డులో నారాయణ కాలేజీ సమీపంలో రహదారిని తమ ఇష్టానుసారం కొందరు తవ్వేయడం వల్ల ఆ కాలనీలో నివసిస్తున్న ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రహదారికి రెండు వైపులా నీరు ఎక్కువగా ఉండడంతో వాటిని మళ్ళించడానికి కొందరు పురపాలక సంఘం అనుమతి లేకుండా నారాయణ కళాశాల కు వెళ్లే రోడ్డును రెండు చోట్ల రహదారికి గండి కొట్టడం జరిగింది. ప్రొక్లైనర్ ను ఉపయోగించి ఈ గండికొట్టారు. అయితే వరద నీరు ప్రవాహం జరిగిన తర్వాత రహదారిని పటిష్టంగా వేయకుండా కేవలం ఇసుక కంకర ఉపయోగించడంతో రహదారి పాడైపోయింది. ఆ గుంత‌ల మూలంగా భారీ వాహనాలు, కార్లు, మోటారు సైకిలు దారులు ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారు. కొంద‌రు గుంత‌ల్లో కూడా ప‌డిపోతున్నారు.

ఇటీవల పురపాలక సంఘానికి చెందిన చెత్త రవాణా చేసే వాహనం కూడా ఒక రోజు ఆ గుంతలో కూరుకుపోయింది. ఇంత జ‌రుగుతున్న మున్సిపాలిటీవారు ఎలాంటి చ‌ర్య‌లు చేప‌ట్ట‌డంలేదు. ఈ గుంత‌ల మూలంగా కాల‌నీల్లో నివసిస్తున్న దాదాపు 200 కుటుంబాలు ఇబ్బందులకు గుర‌వుతున్నారు. ఈ గుంత‌లపై పుర‌పాల‌క సంఘం వారు దృష్టి సారించి ర‌హ‌దారి మ‌రమ్మ‌తులు చేయాల‌ని మహాలక్ష్మి నగర్ కాలనీ వాసులు కోరుతున్నారు. అలాగే మ‌రోసారి ఎవ‌రి ఇష్టానుసారం వారు గుంత‌లు తీయ‌కుండా తగు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కాల‌నీవాసులు వేడుకుంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.