ఎపి రాజధాని అమరావతే.. రాజ్నాథ్ సింగ్
విజయవాడ (CLiC2NEWS): నగరంలో విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల లోక్సభ నియోజక వర్గాల బిజెపి కోర్ కమిటి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రక్షణ వ్యవహారాల్లో భారత్ సాధిస్తున్న పురోగతి ప్రపంచ దేశాల ముందు తలెత్తుకునేలా చేస్తోందన్నారు. వచ్చే ఐదేళ్లో ఎపిలో కూడా బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని పేర్కొన్నారు. వైఎస్ ఆర్సిపి సర్కారు దౌర్జన్యాలపై పోరాటం చేసి నిలువరించాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, కేంద్ర మాజి మంత్రి సుజనాచౌదరి, బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పాల్గొన్నారు.
రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి ఇబ్బందులున్నా పోరాటాల ద్వారానే ప్రజల్లో నిలుస్తామని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఎపికి రాజధాని ఏదనే ప్రశ్నలు ఎదురవుతున్నాయని కొందరు నేతలు ప్రస్తావించగా.. రాష్ట్ర పార్టికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్ఫష్టమైన సమాచారం ఇచ్చిందని.. అమరావతినే ఏకైక రాజధానిగా పరిగణలోకి తీసుకుందని తెలపారు. దీనిపై ఎలాంటి చర్చ అవసరం లేదని మంత్రి స్ఫష్టం చేశారు.