హథ్రాస్ కేసు.. సుప్రీం కీలక నిర్ణయం
అలహాబాద్ హైకోర్టు పర్యవేక్షణలో హథ్రాస్ కేసు విచారణ
లక్నో: దేశవ్యాప్తంగా వివాదాస్పదమైన హథ్రాస్ సామూహిక అత్యాచారం కేసులో సిబిఐ దర్యాప్తుతో సహా అన్ని అంశాలను అలహాబాద్ హైకోర్టు పరిశీలిస్తుందని తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తు పూర్తయ్యేంత వరకు యుపి నుండి దేశరాజధాని కోర్టుకు మార్చాలన్న న్యాయవాదుల అభ్యర్థనను అలాగే ఉంచుతామని సుప్రీం కోర్టు తెలిపింది. 19 ఏళ్ల దళిత యువతిపై సెప్టెంబర్ 14న హథ్రాస్లో నలుగురు ఉన్నత కులస్తులు అత్యాచారం చేసి దారుణంగా చంపేశారనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. బాధితురాలు ఢిల్లీ సఫ్దర్జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సెప్టెంబర్ 29న కన్నుమూసింది. బాధితురాలి దహన సంస్కారాలు అర్థరాత్రి నిర్వహించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఈ అంశం విచారణ సందర్భంగా సామాజిక కార్యకర్త, న్యాయవాది ఇందిరా జైసింగ్ ఉత్తరప్రదేశ్లో న్యాయమైన విచారణ జరగదనే భయాన్ని వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్లో ఈ కేసు దర్యాప్తులో న్యాయం జరగదంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టింది. బదిలీకి సంబంధించినంత వరకు, సిబిఐ ఈ కేసు విచారణను పూర్తి చేయడం సముచితమని చీఫ్ జస్టిస్ ఎస్ఎ.బాబ్డే వ్యాఖ్యానించారు. విచారణ పూర్తి అయిన అనంతరం బదిలీ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని అన్నారు. సిబిఐ విచారణ చేపడుతున్నందున ఈ కేసుపై ఆందోళన అవసరంలేదని అన్నారు. ఈ పిటిషన్లపై తీర్పును రిజర్వ్లో ఉంచుతున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది.