Hyderabad: నాగోల్ ఎస్టీపీ ట్రయల్ రన్ ప్రారంభం

హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలో మురుగునీటిని వంద శాతం శుద్ధి చేయడానికి చేపట్టిన ఎస్టిపిల నిర్మాణంలో చేపట్టిన సంగతి తెలిసిందే. ఎస్టీపీ ప్రాజెక్టుల్లో భాగంగా ప్యాకేజీ-2 లో నిర్మిస్తున్న నాగోల్ ఎస్టీపీ ట్రయల్ రన్ సోమవారం ఎండీ అశోక్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నెలాఖరు లోపు నాగోల్ ఎస్టీపీని ప్రారంభానికి సిద్ధం చెయ్యాలని అధికారులను ఆదేశించారు.
ఎస్టీపీ ప్రాంగణంలో ఎండీ అశోక్ రెడ్డి పర్యటించి సీసీ రోడ్లు, లైటింగ్ పనుల్ని పరిశీలించారు. అంతర్గత రహదారుల నిర్మాణం సహా.. ముగింపు దశలో ఉన్న పనుల్ని త్వరితగతిన పూర్తి చేసి.. ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు. ఎస్టీపీ ప్రాంగణంలోని ఖాళీ స్థలంలో ల్యాండ్ స్కేపింగ్, పూల మొక్కలతో సుందరీకరణ పనులు చేపట్టాలన్నారు. అనంతరం ఎస్టీపీ ప్రాంగణంలో మొక్క నాటారు. ఈ కార్యక్రమంలో ఈడీ డా.ఎం. సత్యనారాయణ, ప్రాజెక్టు డైరెక్టర్-2 సుదర్శన్, సీజీఎం, జీఎం, ఎస్టీపీ ఇతర అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఎస్టిపి ప్రాజెక్టులో భాగంగా 3 ప్యాకేజీల్లో మొత్తం రూ.3866.41 కోట్ల వ్యయంతో 1259.50 ఎంఎల్డిల సామర్థ్యం గల 31 కొత్త మురుగు నీటి శుద్ధి కేంద్రాలు (ఎస్టీపీ) నిర్మించనున్నారు. వీటి నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తే.. రోజూ ఉత్పన్నమయ్యే మురుగును 100 శాతం శుద్ధి చేసే తొలి నగరంగా దక్షిణాసియాలోనే హైదరాబాద్ చరిత్ర సృష్టించనున్నది.