వైద్యసిబ్బంది చేతిలోంచి జారిపడి శిశువు మృతి
వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో దారుణం

హైదరాబాద్: వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో దారుణం జరిగింది. కాన్పు చేస్తున్న సమయంలో వైద్య సిబ్బంది చేతిలోంచి అప్పుడే పుట్టిన శిశువు జారిపడి మృతి చెందింది. ఈ దుర్ఘటన వసన్థలిపురం ప్రాంతీయ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మీర్పేటకు చెందిన గర్భిణి (23) శుక్రవారం రాత్రి కాన్పుకోసం స్థానిక ప్రభుత్వాసుప్రతిలో చేరింది.
సోమవారం తెల్లవారు జామున ఆరు గంటలకు మగశిశువుకు జన్మనిచ్చింది. కాన్పు సమయంలో శిశువు ప్రమాదవశాత్ఉ సిబ్బంది చేతిలోంచి జారి కిందపడటంతో తలకు గాయమైంది. దీంతో తప్పును కప్పిపుచ్చుకునేందుకు శిశువు ఆరోగ్యం బాగోలేదని నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే శిశువు చనిపోవడంతో ప్రసన్న బంధువులు వనస్థలిపురం ఏరియా ఆస్పత్రివద్ద ఆందోళనకు దిగారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.