త్రివిధ దళాలకు విశిష్ట సేవా పురస్కారాలు..

ఢిల్లీ (CLiC2NEWS): త్రివిధ దళాలకు రాష్ట్రపతి బుధవారం విశిష్ట సేవా పతకాలను ప్రదానం చేశారు. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్బంగా ఈ పతకాలను ప్రకటించారు. రక్షణశాఖ ఆధ్వర్యంలో నేడు రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డులను ప్రదానం చేశారు. మొత్తం 37 మంది అధికారులకు పరమ విశిష్ట సేవా పతకాలు, ఐదుగురికి ఉత్తమ యుద్ద సేవా పతకాలు, 57 మందికి అతి విశిష్ట సేవా పతకాలను అందుకున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని తెనాలికి చెందిన వైస్ అడ్మిరల్ శ్రీనివాస్ వెన్నం.. పరమ విశిష్ట సేవా పతకం, నౌ సేనా మెడల్ అందుకున్నారు. ఈయన 2021లో అతి విశిష్ట సేవా పతకాన్ని పొందారు. ఆయన 38 ఏళ్లుగా వివిధ హోదాల్లో నౌకాదళంలో సేవలందించారు. జలాంతర్గామి యుద్ధ తంత్రంలో నిష్ణాతుడిగా పేరొందారు.