జమిలి ఎన్నికలు.. ఇండియాకు అవసరం: ప్రధాని
హైదరాబాద్: దేశంలో జమిలి ఎన్నికలు (ఒకేదేశం, ఒకేసారి ఎన్నికలు) నిర్వహణపై చర్చ నడుస్తున్న సందర్భంలో భారత ప్రధాని నరేంద్రమోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం ఇది చర్చించే విషయం మాత్రమే కాదని, భారత్ కు ఎంతో అవసరమని అన్నారు. ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ 80వ సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీ వర్చువల్ సందేశం ఇచ్చారు. ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించడం భారత్కు అవసరమని ప్రధాని అన్నారు. జమిలి ఎన్నికల అంశంపై కేవలం చర్చ మాత్రమే కుదరదు అని, ఇప్పుడు ఆ విధానం భారత్కు ఎంతో అవసరమని ఆయన అన్నారు. ప్రతి కొన్ని నెలలకు ఒకసారి ఏదో ఒక ప్రదేశంలో ఎన్నికలు జరుగుతున్నాయని, ఆ ఎన్నికల ప్రభావం అభివృద్ధి పనులపై ఎటువంటి ప్రభావం చూపుతుందో తెలుసని, ఈ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని, దానికి ప్రిసైడింగ్ ఆఫీసర్లే మార్గదర్శకులవుతారని ప్రధాని మోడీ అన్నారు.
అంతేకాకుండా వివిధ ఎన్నికలకు వేర్వేరు ఓటరు జాబితాలున్నాయి. వీటి కోసం ధనం, సమయం ఎందుకు వృథా చేసుకోవడం? ప్రస్తుత కాలంలో వేర్వేరు ఓటరు జాబితాలు అవసరం లేదని అభిప్రాయపడ్డారు. అందుకే లోక్సభ, అసెంబ్లీ నుంచి పంచాయతీ ఎన్నికల వరకు అన్నింటికి ఒకే ఓటరు జాబితా ఉండాలని ప్రిసైడింగ్ అధికారులకు ప్రధాని సూచించారు.