మంచిర్యాల: ఆర్టీసీ డిపోలో కరోనా కలకలం!
మంచిర్యాల: దేశంలో కరోనా కేసులు రోజుకు రెండు లక్షలు దాటుతున్నాయి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 3,840 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కేసుల సంఖ్య పెరిగిపోతోంది. కొత్తగా నమోదైన కేసులో అత్యధికంగా 505 జీహెచ్ఎంసీలో, మేడ్చల్లో 407, రంగారెడ్డిలో 302, నిజామాబాద్లో 303, సంగారెడ్డిలో 175 అత్యధికంగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి.
తాజాగా మంచిర్యాల జిల్లాలోని ఆర్టీసీ డిపోలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. గత రెండు రోజుల్లో ఇద్దరు డ్రైవర్లు కరోనాతో మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మరో 12 మంది కార్మికులు కరోనా బారిన పడినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఆర్టీసీలో విధులు నిర్వహిస్తున్న కార్మికులు, డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. కరోనా వైరస్ తీవ్రస్థాయిలో ఉన్నా.. డిపోలోని బస్సులను శానిటైజ్ చేయడం లేదని కార్మికులు వాపోతున్నారు.
తెలంగాణ గడిచిన 24 గంటల్లో 3,840 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం కరోనా బులిటెన్లో తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,41,885కు చేరింది. కొత్తగా 1,198 మంది బాధితులు వైరస్ నుంచి కొలుకొని ఇండ్లకు వెళ్లారు. ఇప్పటి వరకు 3,09,594 మంది కోలుకున్నారు. తాజాగా వైరస్ బారినపడి మరో తొమ్మిది మరణించారని పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 30,494 యాక్టివ్ కేసులున్నాయని బులిటెన్లో పేర్కొన్నారు.