యాదాద్రి ఆలయం.. 30 మందికి పాజిటివ్!
యాదాద్రి: తెలంగాణలో కరోనా కేసులు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు పాఠశాలలు, కళాశాలల్లో పంజా విసిరిన వైరస్ తాజాగా ఆధ్యాత్మిక కేంద్రాలపైనా ప్రభావం చూపుతోంది. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఉద్యోగులు, అర్చకుల్లో 30మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని ఆలయ ఈవో గీతారెడ్డి పేర్కొన్నారు. తాజాగా ముగిసిన ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ఈ క్రమంలో వారి నుంచి విధుల్లో ఉన్న ఆలయ సిబ్బందికి వైరస్ సోకి ఉంటుందని భావిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఆలయ సిబ్బందికి కొవిడ్ నిర్ధారణ కావడంతో స్వామివారి ఆర్జిత సేవలను ఆదివారం నుంచి నిలిపేయాలని నిర్ణయం తీసుకున్నారు. కేవలం దైవ దర్శనాలకు మాత్రమే భక్తులను అనుమతిస్తామని ఆమె స్పష్టం చేశారు.