28 నుంచి ‘రైతుబంధు’ సాయం

హైదరాబాద్: ఈనెల 28 నుంచి ‘రైతుబంధు’ పెట్టుబడి సాయాన్ని పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రైతుల ఖాతాల్లో ఎకరానికి రూ.5 వేల చొప్పున రూ.7,300 కోట్ల నిధులు జమ చేయడానికి సిద్ధమైంది. ఈ యాసంగిలో దాదాపు 59.32 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయాన్ని అందజేయనున్నారు. గతేడాది 57.62 లక్షల మంది పట్టాదారులకు రైతుబంధు సాయాన్ని పంపిణీ చేయగా.. ఈ సీజన్లో 1.70 లక్షల మంది అదనంగా లబ్ధిపొందనున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. గతంలో ఎదురైన సాంకేతిక సమస్యలను పరిష్కరించడంతో కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన రైతులు ఈసారి రైతుబంధు లబ్ధిదారుల జాబితాలో చేరారు. యాసంగి పెట్టుబడిసాయం పంపిణీని ఈ నెల 27 నుంచి మొదలు పెట్టి, పదిరోజుల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వ్యవసాయ, ఆర్థికశాఖ అధికారులను ఇప్పటికే ఆదేశించారు. 27వతేదీ ఆదివారం కావడంతో రైతుబంధు నగదు బదిలీని 28 నుంచి ప్రారంభించనున్నారు. బ్యాంకుల నుంచి రైతులు నగదు డ్రా చేసే సమయంలో కొవిడ్ నిబంధనలు పాటించేలా పర్యవేక్షణ చర్యలు చేపట్టాలని వ్యవసాయశాఖ కార్యదర్శి బీ జనార్దన్రెడ్డి కలెక్టర్లు, జిల్లా వ్యవసాయాధికారులను ఆదేశించారు.