జనవరి 13 నుంచి ఐనవోలు జాతర
వరంగల్: ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి జాతర జనవరి 13 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు రాష్ర్ట పంచాయతీరాజ్, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశారు. ఈ జాతరకు అశేషంగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగు జాగ్రత్తలతో ఏర్పాట్లు చేయాలని ఆలయ అధికారులు, అర్చకులను ఆదేశించారు. భక్తులకు అవసరమైన భద్రత, లావెట్రీలు, చలువ పందిళ్ళు, మంచినీటి వసతి, స్నానాల గదులు, బట్టలు మార్చుకునే గదులు, మహిళలకు ప్రత్యేక వసతులు, క్యూ లైన్లు, విద్యుత్, సిసి కెమెరాలు, భక్తులకు అన్నదానం వంటి అనేక వసతుల కల్పన పై ఆయాశాఖల ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించారు. అధికారులకు తగు సూచనలు, సలహాలు చేశారు.
కరోనా నిబంధనలు పాటించాలని, మాస్కులు ధరిస్తేనే దర్శనం కలిగించాలని చెప్పారు. వైద్య శాఖతో పాటు, ఆరూరీ గట్టుమల్లు ట్రస్ట్ నుండి మాస్కు లు పంపిణీ చేయాలని సూచించారు. అలాగే వీఐపీలకు, దాతలకు ప్రత్యేక పాసులు జారీ చేసి, నిర్ణీత సమయాల్లో నేరుగా దర్శనాలు చేయించాలన్నారు. భక్తులకు దర్శనార్థం చేసే ఏర్పాట్లలో కరోనా నిబంధనలు పాటించాలన్నారు. భక్తులు కిక్కిరిసి పోకుండా, సామాజిక దూరం పాటించేలా చూడాలని ఆదేశించారు. కాగా, రోడ్ల మరమ్మతులు, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా, ఫైర్ ఇంజన్, వైద్య సదుపాయాలు తదితర అంశాల వారీగా మంత్రి సమీక్షించారు.
అంతకుముందు మంత్రి ఐనవోలు మల్లికార్జున స్వామి వారిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రికి ఆలయ ఈవో, సిబ్బంది, పూజారులు మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయంలో మొక్కులు తీర్చుకున్న మంత్రి ఎర్రబెల్లి ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించారు. ఏర్పాట్ల గురించి ఆలయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ గుండా ప్రకాశ్ రావు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ తోపాటు, డిసిసిబి చైర్మన్ మార్నేని రవిందర్ రావు, కుడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖలకు చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.