వ్యక్తిని ఎత్తుకెళ్లిన పెద్దపులి..
జైపూర్: దేశవ్యాప్తంగా పులుల సంఖ్య పెరిగిపోవడంతో అవి అటవీ దాటి గ్రామాల బాటపడుతున్నాయి. ఈ మధ్యకాలంలో తెలంగాణలోని పలు జిల్లాల్లో పెద్దపులి సంచారం వార్తలు తరచూ వింటూనే ఉన్నాం.. పులి సంచారంతో పాటు ప్రజలను, పశువులను పొట్టన పెట్టుకుంటున్న ఘటనలు కూడా తరచూ చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా రాజస్థాన్ రాష్ట్రంలోని సవాయి మాధోపూర్ జిల్లా కనేడీలోని ఓ గ్రామంలోకి చొరబడిన పెద్దపులి ఓ వ్యక్తిపై దాడిచేసి చంపేసింది. రణతంబోర్ టైగర్ రిజర్వ్కు సమీపంలో ఉన్న కనేడీ గ్రామంపై నిన్న పెద్దపులి దాడి చేసింది. గ్రామంలో కనిపించిన ఓ వ్యక్తిని (పప్పు గుజ్జర్ (40)) చంపేసి ఎత్తుకెళ్లిందని అధికారులు దృవీకరించారు. అయితే ఆయన మృతదేహం కనిపించడం లేదని, తమ సిబ్బంది వెతుకుతున్నారని టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ టికమ్ చంద్ వర్మా వెల్లడించారు. కాగా, పులి సంచరిస్తుండటంతో టైగర్ రిజర్వ్ సమీపంలోని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.